ఏ కష్టమొచ్చిందో: ఉరివేసుకుని యువ వైద్యురాలి ఆత్మహత్య
ఏ కష్టమొచ్చిందో గానీ ఓ యువ వైద్యురాలు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం...
హైదరాబాద్: ఏ కష్టమొచ్చిందో గానీ ఓ యువ వైద్యురాలు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నంకు చెందిన మూగి అనూష(25) నగరంలోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఫిజియోథెరపి వైద్యురాలిగా పనిచేస్తోంది.
స్టీల్ ప్లాంట్లో ఉద్యోగి అయిన అనూష తండ్రి మూగి ఎల్లాజీరావు ఎనిమిదేళ్ల క్రితం మరణించాడు. అప్పట్నుంచి తల్లి రాధావేణియే ఆమె ఆలనాపాలనా చూసుకుంటోంది. అనూష విజయనగరంలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. నాలుగు నెలల క్రితం ఉపాధిపై ఎన్నో ఆశలతో హైదరాబాద్ వచ్చింది. అమీర్పేటలో తన తల్లితో కలిసి నివాసం ఉంటోంది.
కాగా, మూడు రోజుల క్రితం మాదాపూర్ హైటెక్ థియేటర్ సమీపంలో ఉన్న అతిథి హాస్టల్లో చేరింది. గురువారం ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో సాయంత్రం 4.30 ప్రాంతంలో వసతి గృహం నిర్వాహకులు కిటికీలోంచి చూడగా ఫ్యాన్కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది.
నాలుగు నెలల క్రితమమే నగరానికి వచ్చిన ఆ యువతి.. అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె మరణంతో తల్లి రాణావేణి కన్నీరుమున్నీరుగా విలపించింది. అనూషకు శిరీష అనే సోదరి ఉంది. ఆమెకు వివాహమైంది.