బెదిరింపులు: మహిళా కండక్టర్పై రేప్ యత్నం
నల్గొండ: విధులు ముగించుకొని ఆర్టీసీ డిపో నుంచి బయటకు వస్తున్న మహిళా కండక్టర్పై ఏడిసి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి నల్గొండ జిల్లా దేవరకొండలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో దళిత సంఘాలు గురువారం దేవరకొండలో ఆందోళన చేపట్టారు.
కడప జిల్లాకు చెందిన ఓ మహిళ రెండేళ్లుగా దేవరకొండ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త కూడా ఆ డిపోలోనే ఔట్ సోర్సింగ్ కార్మికుడిగా పని చేస్తున్నారు. విధుల్లో భాగంగా ఆమె బుధవారం దేవరకొండ నుంచి కల్వకుర్తి వెళ్లి తిరిగి రాత్రి 9గంటలకు డిపోకి చేరుకున్నారు.
టికెట్ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును డిపోలో చెల్లించడానికి రాత్రి 9.10గంటలకు వెళ్లారు. సమీపంలో మద్యం మత్తులో ఉన్న ఏడిసి ఎండి అలీమొద్దీన్ తన మాట వినకుండా కడపకు పంపిస్తానని బెదిరించినట్లు ఆమె చెప్పారు.
డబ్బు చెల్లించి తిరిగి వస్తుండగా ఏడిసి ఆమె చేయిపట్టుకొని బస్సు చాటుకు లాక్కెళ్లి అసభ్యకరంగా, ప్రవర్తించినట్లు ఆమె వాపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై రేప్, వేధింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై స్పందించిన దేవరకొండ డిపో మేనేజర్ సీతారామకృష్ణ మాట్లాడుతూ.. ఏడిసిని విధులకు దూరంగా ఉంచామని చెప్పారు.