టీడీపీ కార్యకర్త హత్య: కొట్టి చంపిన ఎన్డీ చంద్రన్న వర్గం సభ్యులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నర్సంపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది.రాయల భాస్కర్(55) అనే టీడీపీ కార్యకర్తను బుధవారం ఎన్డీ చంద్రన్నవర్గం హత్య చేసింది.
ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నర్సంపేటలో రాయల భాస్కర్(55) అనే టీడీపీ కార్యకర్తను బుధవారం ఎన్డీ చంద్రన్నవర్గం హత్య చేసింది. వివరాలిలా ఉన్నాయి.. రాయలభాస్కర్ టీడీపీ క్రీయాశీలక కార్యకర్త.
సీపీఐ ఎంఎల్ ఎన్డీ చంద్రన్న వర్గానికి సానుభూతిపరుడిగా ఉన్నాడని సమాచారం. పోడు భూములు, ట్రాక్టర్ కిరాయిల విషయంలో సమీపంలో ఉన్న రాజీవ్ నగర్ కాలనీ గొత్తి కోయలతో వివాదాలున్నాయి.
దళ కమాండర్ రవి అతనిని పలుమార్లు హెచ్చరించినట్లు తెలిసింది. అతను పద్ధతి మార్చుకోకపోవటంతో 10మంది దళ సభ్యులు, 10మంది గొత్తికోయలు కలిసి వెళ్లి తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాలతో రోడ్డుపక్కన పడి పోయిన భాస్కర్కు మంచినీళ్లు కూడా ఎవరూ పోయవద్దని హెచ్చరించారు.
గిరిజనులపై పెత్తనం చెలాయిస్తే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరికలు చేశారు. దళం సభ్యులు అక్కడ నుంచి వెళ్లిపోయి న తర్వాత గ్రామస్ధులు భాస్కర్ను ఆసుపత్రికి తీసుకువెళ్దామని ప్రయత్నించగా అప్పటికే మృతిచెందాడు. విషయం తెలిసి పోలీసు బలగాలు చేరుకున్నాయి. అటవీ ప్రాంతంలో గాలింపు జరుపుతున్నాయి.