‘గుడ్ బై’: గండిపేట చెరువులో దూకి టెక్కీ ఆత్మహత్య
ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ.. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి బుధవారం గండిపేట చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్: ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ.. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి బుధవారం గండిపేట చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నార్సింగి ఎస్ఐ నాగిరెడ్డి కథనం ప్రకారం.. పురానాపూల్ హుస్సేనీ ఆలంకు చెందిన సందీప్సింగ్ (25) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చాడు.
బుధవారం గండిపేటకు వచ్చిన సందీప్ స్లూయిస్ గది సమీపంలో తన సెల్ఫోన్ను వదిలేసి నీటిలో దూకాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈమేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి సాయంత్రం మృతదేహాన్ని వెలికి తీశారు.
నీళ్లలో దూకేముందు స్నేహితులకు గుడ్బై అంటూ వాట్సాప్లో సందేశం పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. జీవితంలో అనుకున్నవి సాధించలేక పోవడంతో ఒత్తిడికి గురవడంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.