ఏ కష్టమొచ్చిందో..: ఇద్దరు చిన్నారులతో సహా తల్లి ఆత్మహత్య
శనివారం తెల్లవారుజామున ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్: మల్కాజ్గిరి రైల్వేస్టేషన్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఎంత కష్టమొచ్చిందో గానీ ఆ తల్లి ఇంత దారుణమైన నిర్ణయానికి వచ్చింది.
సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. పుప్పాలగూడకు చెందిన నక్కా గౌరమ్మ(35), సాయి తేజ(4), నాగరాజు(5) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
చిన్నారులిద్దరు మణికొండ విశ్వభారతి పాఠశాలలో చదువుతున్నారు. పిల్లలిద్దరూ స్కూల్ దుస్తుల్లో ఉండటంతో శుక్రవారమే వారి తల్లి పాఠశాల నుంచి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలిపారు. కాగా, తల్లితోపాటు ఇద్దరు పిల్లలు చనిపోవడంపై పలు అనుమానాలకు కూడా తావిస్తోంది.