రేప్ చేసి మహిళపై పెట్రోల్ పోసి తగులబెట్టారా?
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని బషీరాబాద్ మండలం నెలపల్లి వద్ద మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారం చేసి అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కిరాయికి ఇల్లు కావాలని..
మహబూబ్నగర్ జిల్లాలోని పెద్ద కొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో వృద్ధ దంపతులకు మత్తుమందు ఇచ్చి దొంగలు 15 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. కిరాయి ఇళ్లు కావాలని వచ్చిన దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వివాహిత ఆత్మహత్య
ఆర్థిక లావాదేవీల కారణంగా జరిగిన గొడవలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో సోమవారం ఉదయం ఓ వివాహిత మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న హేమవతి (33) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన డబ్బుల విషయంలో గ్రామస్థులతో గొడవ జరిగింది. దాంతో మనస్తాపానికి గురైన హేమవతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.