వెంటపడి అసభ్య ప్రవర్తన: చెప్పుతో కొట్టి, పోలీసులకు అప్పగించిన మహిళ
హైదరాబాద్: వెంటపడి వేధింపులకు గురిచేస్తున్న ఓ వ్యక్తిని చితక్కొట్టి, పోలీసులకు అప్పగించింది బాధిత మహిళ. అంతేగాక, పోలీసుల ముందే అతడ్ని చెప్పుతో కొట్టి పోకిరీ చేష్టలు మానుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. ఈ ఘటన నగరంలోని బంజారాహిల్స్లో చోటు చేసుకుంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్లో నివసించే బాధిత మహిళ(34) బంజారాహిల్స్ రోడ్ నెం.2 లోని సాగర్ సొసైటీలో హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన దేవదాసు(38) అనే కార్పెంటర్ వారం రోజుల నుంచి ఆమె వచ్చే బస్సులోనే వస్తూ వెంటపడుతున్నాడు.
బంజారాహిల్స్లో ఆమె బస్సు దిగి తాను పని చేసే ప్రాంతానికి నడుచుకుని వెళ్లే సమయంలో అనుసరిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. తనతో మాట్లాడాలంటూ అడ్డుపడుతూ ఆమెను వేధించసాగాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు ఈ వేధింపుల వ్యవహారాన్ని తన సోదరుడి దృష్టికి తీసుకెళ్లింది.
మంగళవారం ఉదయం ఆమె తన సోదరుడు, వదినను తీసుకొని ఎప్పటిలాగే బస్సులో బంజారాహిల్స్కు వచ్చి సాగర్సొసైటీకి నడుచుకుంటూ వెళ్తుండగా రోజులాగే దేవదాసు కూడా ఆమెను వెంబడించసాగాడు.
బాధితురాలి సోదరుడు, వదిన.. దేవదాస్ను పట్టుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. పోలీసుల ముందే బాధిత మహిళ ఆ పోకిరీని చెప్పుతో చితక్కొట్టింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు, దేవదాసుపై ఈవ్టీజింగ్ కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.