యువతికి మత్తు మందిచ్చి అపహరణ: గొలుసు చోరీ
హైదరాబాద్: నగరంలో ఆటోవాలాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. తాజాగా.. కంప్యూటర్ శిక్షణ పొందుతున్న ఓ యువ ఇంజినీరింగ్ విద్యార్థినిని బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని మత్తు మందు ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును అపహరించుకుపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పేట్బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దుర్గాభవానీ(22) బీటెక్ పూర్తి చేసి అమీర్పేటలోని ఓ వసతి గృహంలో ఉంటూ అక్కడే కంప్యూటర్ శిక్షణ తీసుకుంటోంది. బుధవారం రాత్రి 7.30గంటల ప్రాంతంలో ఆమె శిక్షణకు వెళ్లి తిరిగి హాస్టల్కు వస్తుండగా ఓ ఆటో డ్రైవర్ ఆమెను బలవంతంగా ఆటోలోకి లాక్కుని ముక్కు వద్ద తుండగుడ్డతో మత్తుమందు పెట్టాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది.
ఆ తర్వాత ఆమెను జీడిమెట్ల సమీపంలోని ఫాక్స్సాగర్ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి మెడలోని తులం బంగారు గొలుసును అపహరించాడు. అనంతరం రోడ్డుపైకి తీసుకువచ్చి వదిలేశాడు. బాధితురాలు ఎలాగోలా హాస్టల్కు చేరుకుంది. గురువారం పేట్బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గొలుసు అపహరణకు గురైంది ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కావడంతో కేసును ఆ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. అక్కడి పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
డెంగ్యూతో అంగన్వాడీ కార్యకర్త మృతి
ఆదిలాబాద్: జిల్లాలోని కాగజ్నగర్ మండలం కోసిని గ్రామపంచాయతీలో అంగన్వాడీ కార్యకర్త జాడి వందన(38) డెంగ్యూతో గురువారం మృతి చెందింది. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వందనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. అక్కడ వైద్యులు డెంగ్యూగా నిర్ధారించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.