ప్రియురాలు మరణించిందని యువకుడి ఆత్మహత్య
మెదక్: ప్రేమించిన యువతి మరణాన్ని భరించలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం తుమ్మలపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తపల్లికి చెందిన భూమేశ్ (23)కు తల్లిదండ్రులు లేరు. ఎంబీఏ వరకు చదివిన అతడు అదే గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థినిని ప్రేమించాడు.
అయితే ఫిబ్రవరి 27న అతడు ప్రేమించిన యువతి ఆత్మహత్య చేసుకుంది. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు యువతి సెల్ఫోన్ కాల్ లిస్టులో ఎక్కువ కాల్స్ భూమేశ్కు వెళ్లినట్లు గుర్తించారు. అతడికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం తుమ్మలపల్లిలోని అక్క హిమబిందు ఇంటికి వెళ్లిన భూమేశ్, ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆటోబోల్తా: బాలుడితో సహా మహిళ మృతి
వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి చెట్టుకు ఢీకినడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడునెలల బాబు సహా ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం తిరునాలపల్లి వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చర్లమండలం త్యాగాడ గ్రామానికి చెందిన కొన్నపి నాగమణి(50)తోపాటు శామ్సుందర్ అనే చిన్నారి మృతిచెందారు.
డ్రైవర్ సహా ఆరుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, గాయపడిన వారిలో కొన్నారు సురేష్ పరిస్థితి విషమంగా ఉంది. ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా చర్ల మండలం త్యాగాడ వాసులుగా గుర్తించారు. వీరు విజయవాడ కనకదుర్గ ఆలయంలో మొక్కు తీర్చుకొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.