స్నానానికి వెళ్లొచ్చే లోపు అంతా దోచేశారు: బనియన్, తువ్వాలుతో ఫిర్యాదు
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విశ్రాంతి గదిలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఓ ప్రయాణికుడు విశ్రాంతి గది వద్ద తన బ్యాగు పెట్టి స్నానానికి వెళ్లి వచ్చేలోపు బ్యాగు మాయమైంది. దీంతో చేసేదేమి లేక తాను వేసుకున్న బనియన్, తువ్వాలుతోనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, అతనికి దుస్తులు అందించడంతో వాటిని వేసుకున్నాడు. జిఆర్పీ పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన యోగేశ్వర్(25), ఎస్కార్ట్ ట్రాక్టర్ కంపెనీలో ప్రాజెక్ట్ అధికారిగా పని చేస్తున్నారు.
సికింద్రాబాద్లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం సమావేశం ఉండటంతో హాజరయ్యేందుకు సికింద్రాబాద్కు చేరుకున్నారు. ఒకటో నెంబర్ ప్లాట్ ఫాంపై ఉన్న రిజర్వేషన్ ప్రయాణికుల విశ్రాంతి గది వద్ద బ్యాగు పెట్టి బనియన్, తువ్వాలుతో స్నానానికి వెళ్లి 15నిమిషాల తర్వాత తిరిగివచ్చారు.
అతను వచ్చేసరికి బ్యాగు కన్పించకపోవడంతో చేసేదేమి లేక, అలాగే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులే అతనికి వేరే దుస్తులు ఇప్పించారు. తన బ్యాగులో ఓ సెల్ఫోన్, కొంత నగదు, విలువైన పత్రాలు ఉన్నట్లు తెలిపారు.
చోరీ జరిగిన ప్రదేశంలో సిసి కెమెరాలు లేకపోవడంతో నిందితుడ్ని గుర్తించడం పోలీసులకు కూడా కష్టంగా మారింది. కాగా, పోలీసులు ఇచ్చిన దుస్తులు వేసుకుని అతను హాజరుకావాల్సిన సమావేశానికి వెళ్లిపోపోయారు యోగేశ్వర్.