హైజాక్?: ప్రియురాలి కోసం విమానాలను నిలిపేసిన హైదరాబాదీ యువకుడు
హైదరాబాద్: తన ప్రియురాలి కోసం విమానాలను నిలిపేసిన నగరానికి చెందిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం విమానాలను హైజాక్ చేస్తారంటూ ఓ మెయిల్ పంపడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
హైదరాబాద్, ముంబై, చెన్నై విమానాశ్రయాల్లో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించి ముమ్మర తనిఖీలను నిర్వహించారు. ఈ-మెయిల్ పై ఆరా తీసిన ముంబై పోలీసులు హైదరాబాద్ నుంచి వచ్చినట్లు గుర్తించి పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డికి సమాచారం ఇచ్చారు.
సీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి నేతృత్వంలో మెయిల్ చేసిన యువకుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడిని అమీర్పేటకు చెందిన వంశీగా గుర్తించారు.
ఈ క్రమంలో వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయి పేరు మీద వంశీ మెయిల్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. పుణెలో ఉన్న ప్రియురాలి వద్దకు వెళ్లే అవకాశం లేకపోవడంతో వంశీ ఈ విధంగా చేసినట్లు పోలీసులు తేల్చారు. తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసులను పరుగులు పెట్టించిన వంశీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.