రాష్ట్ర విభజనపై కలాం ఏమన్నారు: వెల్లడించిన గవర్నర్ నరసింహాన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఏమన్నారనే విషయాన్ని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్ వెల్లడించారు. 'జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సింది రెండు రాష్ట్రాల అభివృద్ధి. అనుభవం కలిగిన నీవు రెండు రాష్ట్రాలను ఆ దిశగా తీసుకెళ్లు' అని కలాం తనకు చెప్పినట్లు నరసింహాన్ తెలిపారు.
కలాంను ఎప్పుడు కలిసినా ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించే మాట్లాడేవారని చెప్పారు. వ్యక్తిగతంగా కలాంతో తనకు పాతికేళ్లుగా అనుబంధం ఉందని తెలిపారు. కలాంను తాను ఎప్పుడూ గురువుగానే భావిస్తానని గవర్నర్ తెలిపారు. కలాం మరణం పట్ల గవర్నర్ నరసింహాన్ దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. కలాం మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు.
దేశానికి ఎనలేని సేవలు అందించిన మహానేత కలాం అని గవర్నర్ నరసింహన్ కొనియాడారు. సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఐఐఎంలో ప్రసంగిస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. కలాంను షిల్లాంగ్లోని ఎస్పీ ఖాసీ హిల్స్లోని ఎం ఖర్కరంగ్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కలాం మరణించిన సంగతి తెలిసిందే.