చానల్ గొంతు నొక్కడం సరికాదు: ఏబీఎన్ బ్యాన్పై ఫైర్
మెదక్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ పైన నిషేధం విధించడం బడుగుల గొంతు నొక్కడమేనని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ సోమవారం అన్నారు. ఏలాంటి ఆధారం లేకుండానే చానల్ పైన నిషేధం విధించారని, ఇది సరికాదన్నారు.
చానల్ పైన విధించిన నిషేధం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానంటు ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఒక చానెల్ గొంతును నొక్కివేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు.
రాజయ్యను బర్తరఫ్ చేయడం అణగారిన ప్రజల్ని తీవ్రంగా అవమానపర్చడమే అవుతుందన్నారు. రాజయ్యను తప్పించాలని సీఎం కేసీఆర్ అనుకుంటే రాజీనామా కోరవచ్చని, బర్తరఫ్ చేయడమంటే క్యాబినెట్ నుంచి నెట్టివేడమేనన్నారు. ఆయన మెదక్ జిల్లాలో విలేకరులతో మాట్లాడారు.
సమైక్య పాలనలో తెలంగాణ చెరువులు ఆగమాగం: నాయిని
సమైక్య పాలనలో తెలంగాణలోని గొలుసుకట్టు చెరువులు ఆగమయ్యాయని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి వేరుగా అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ పేరిట వాటిని పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన చెప్పారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన సోమవారం తెలంగాణ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో తొలిసారి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు.