టెక్కీ శ్రీనివాస్ భార్య సూటి ప్రశ్న: 'ట్రంప్కేం సంబంధం, ఇంతకుమించి మాట్లాడను'
కన్సాస్ కాల్పుల ఘటన పైన వైట్ హౌస్ స్పందించింది. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్లే కేన్సస్ కాల్పుల ఘటన చోటు చేసుకుందన్న ఆరోపణలపై వైట్ హౌస్ స్పందించింది.
హైదరాబాద్/వాషింగ్టన్: కన్సాస్ కాల్పుల ఘటన పైన వైట్ హౌస్ స్పందించింది. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్లే కేన్సస్ కాల్పుల ఘటన చోటు చేసుకుందని మృతుడు శ్రీనివాస్ కూచిబోట్ల సతీమణి సహా పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై వైట్ హౌస్ వివరణ ఇచ్చింది.
ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్లే కేన్సస్లో కాల్పుల ఘటన జరిగిందన్న వాదనను ఖండించింది. ట్రంప్ వ్యాఖ్యలకు ఈ దురాఘతానికి సంబంధం పెట్టడం అసంబద్ధమని పేర్కొంది.
ప్రాణనష్టం ఎలా సంభవించినా అది విషాదకరమేనని, అయితే దానికి వేరే అంశాలతో ముడిపెట్టడం తన ఉద్దేశంలో అసంబద్ధమని, ఇంతకు మించి తానేమీ మాట్లాడనని వైట్హౌస్ ప్రెస్ కార్యదర్శి సీయాన్ స్పైసర్ తెలిపారు.
కేన్సస్లో అమెరికా నౌకాదళ మాజీ ఉద్యోగి జరిపిన కాల్పుల్లో భారత ఇంజినీరు శ్రీనివాస్ కూచిబొట్ల మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడిన ఘటనపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు.
మరోవైపు, ఈ ఘటనపై వేగంగా దర్యాప్తు జరపాలని భారత రాయబారి కార్యాలయం అమెరికా విదేశాంగ శాఖకు లేఖ రాసింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని, ఘటనను తీవ్రంగా ఖండించిన అమెరికా ప్రభుత్వం పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలియజేసిందని అమెరికాలో భారత రాయబారి కార్యాలయ అధికార ప్రతినిధి ప్రతీక్ మాథుర్ చెప్పారు.
ఏం చర్యలు తీసుకుంటున్నారు
మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? మైనార్టీల భద్రత కోసం అమెరికా ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇకనైనా ఇలాంటి విద్వేష పూరిత నేరాలను ఆపడానికి ప్రభుత్వం కృషి చేస్తుందా? నాకు సమాధానం కావాలి.. ఏం చర్యలు తీసుకుంటుందో ప్రభుత్వం చెప్పాలని అమెరికాలో కాల్పుల్లో మరణించిన తెలుగు యువకుడు శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన ఆవేదన వ్యక్తం చేశారు.
చాలా ఆందోశన చెందా
కన్సాస్లో అమెరికన్ జాత్యహంకార కాల్పుల్లో శ్రీనివాస్ మరణించగా, అలోక్ అనే యువకుడు గాయాలతో బయటపడిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ పని చేస్తున్న గార్మిన్ కంపెనీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సునయన మాట్లాడారు. అమెరికాలో కాల్పుల ఘటనలు చూసి గతంలో చాలా ఆందోళన చెందానని, అమెరికాలో ఉండడం సురక్షితమేనా అని భయపడేదాన్నని, అయితే శ్రీనివాస్ ధైర్యం చెప్పేవారని, అమెరికాలో మంచి జరుగుతుందని అనేవారని సునయన గుర్తు చేసుకున్నారు.
అమెరికా ఏం చేయాలనుకుంటోంది
అసలు ఎందుకిలా జరిగింది? ఈ జాతివివక్షను, దౌర్జన్యాన్ని, మారణకాండను నిలువరించడానికి అమెరికా ఏం చేయాలనుకుంటుందో ముందు సమాధానం చెప్పాలని సునయన ఆవేదనగా ప్రశ్నించారు.
అన్నీ కన్నీరు అయిపోయాయి
దశాబ్దం క్రితం తామిద్దరం కూడా ఒకేసారి అమెరికాకు వచ్చామని, వేర్వేరు నగరాల్లో నివసిస్తూ వేర్వేరు విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నప్పటికీ ఆన్లైన్ పరిచయంతో చాలా సన్నిహితమయ్యామని, ఆరేళ్లపాటు ప్రేమించుకొని, పెళ్లి చేసుకున్నామని, ఓలెత్కు వచ్చి తన సొంత ఇంటి స్వప్నాన్ని సాకారం చేసుకున్నామని, ఇప్పుడిక పిల్లల కోసం ఎన్నెన్నో ఊహలు అల్లుకున్నామని, అవన్నీ కన్నీరైపోయాయని దుఃఖంతో చెప్పారు. అప్పుడు అక్కడున్న వారి కళ్లూ చెమ్మగిల్లాయి.
ప్రతి ఒక్కరు హానికారకులు కారని గుర్తుంచుకోవాలి
ప్రతిఒక్కరూ అమెరికాకు హానికారకులు కారుకదా అంటూ సునయన ఆవేదనగా అన్నారు. వివక్ష ఉన్మాదానికి తన జీవితభాగస్వామి ఇలా అమాయకంగా బలైపోయిన తర్వాత తమ కుటుంబం అమెరికాలో ఉండాలా, వద్దా అనే సందేహం పీడిస్తోందన్నారు. ఇమిగ్రెంట్లకు అసలిక్కడ విలువ ఉందా అని అడిగారు. నా ఒక్కదాని భర్త గురించే అడగటం లేదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరి కోసం అడుగుతున్నానని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాని, తన ప్రశ్నకు జవాబు కావాలన్నారు.
మేం అమెరికాకు చెందుతామా?
మేమసలు అమెరికాకు చెందుతామా, చెందమా, అనే దిగ్భ్రాంతికి మైనారిటీలు గురవుతున్నారు అంటూ ఆమె శ్రీనివాస్ పని చేస్తున్న జిపీఎస్ తయారీదారు గార్మిన్ సంస్థలో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.