ఇంట్లోంచి బయటకు సంచి విసిరేశారు: ఏసీపీ ఆస్తులు రూ.13 కోట్లు(పిక్చర్స్)
హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మరో తిమింగలం ఏసీబీ అధికారులకు చిక్కింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కూకట్పల్లి ఏసిపి ఎన్ సంజీవ రావును ఎసిబి శనివారం అరెస్టు చేసింది. ఆయన నివాసాల్లో ఏసీబీ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ సోదాల్లో దాదాపు రూ.13 కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది. బాలానగర్ హస్మత్ పేటలోని ఆయన ఇంటి పైన శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో డిఎస్పీ సునీత ఆధ్వర్యంలో అధికారులు దాడులు చేశారు. సాయంత్రం వరకు తనిఖీలు సాగాయి.
అదే సమయంలో రంగారెడ్డి, వరంగల్, మెదక్ జిల్లాలోని ఆస్తులు, బంధువుల ఇల్ల పైన వేర్వేరు బృందాలు సోదాలు జరిపాయి. ప్రస్తుతం ఆయన పని చేస్తున్న కూకట్పల్లి ఏసిపి కార్యాలయంలోను డిఎస్పీలు రవి కుమార్, సిద్ధిఖీ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు.
సంచి విసిరేయడంతో కలకలం
ఇదిలా ఉండగా, హస్మత్ పేటలోని సంజీవరావు ఇంట్లో తనిఖీల సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంజీవ రావు ఇల్లు విలాసవంతంగా ఉండటం, అక్కడ అనేక భూసంబంధ పత్రాలు లభించడం, చాలావరకు బంధువులు, బినామీల పేర్లతో ఉండటం దర్యాఫ్తు అధికారులను ఆశ్చర్యపరిచింది.
ఈ క్రమంలో ఇంటి వెనుక వైపు ఉన్న కిటికీ నుంచి ముడివేసి ఉన్న బరువైన మూటను బయటకు విసిరేయడంతో కలకలం చెలరేగింది. అది గమనించిన మీడియా ప్రతినిధులు అటువైపు పరుగులు తీశారు. ఏసీబీ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఆ మూటలో స్థలాలకు సంబంధించిన పాస్ పుస్తకాలు, చెక్ బుక్కులు మాత్రమే ఉన్నాయని డిఎస్పీ సునీత తెలిపారు.
ఏసీపీ సంజీవ రావు
పాస్ పుస్తకాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఆశ్తుల విలువ రూ.13 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ డైరెక్టర్ ఏకే ఖాన్ చెప్పారు.
మీడియాకు వివరాలు చెబుతున్న ఏసీబీ అధికారి సునీత
ఆయన అస్తుల చిట్టా... హస్మత్ పేటలో మోడర్న్ బిల్డింగ్, కార్ఖానలోని వాసవీకాలనీలో మూడు ప్లాట్లు. మెదక్ జిల్లా ములుగు మండలం కొట్యాల అలీనగర్లో 36 ఎకరాలకు పైగా భూమి. రంగారెడ్డి జిల్లా శామీర్ పేట మండలం కేశవపురంలో తొమ్మిది ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి. పాంహౌస్.
కూకట్పల్లిలో..
వరంగల్ బచ్చన్నపేటలో 44 ఎఖరాలకు పైగా భూమి. ఓ స్విఫ్ట్ కారు. హోండా సిటీ కారు. 750 గ్రాముల బంగారు నగలు. రూ.3.29 లక్షల నగదు.
కూకట్ పల్లిలోని ఇంటిలో ఏసీబీ అధికారుల పరిశీలన
వరంగల్ జిల్లా బచ్చన్నపేటకు చెందిన సంజీవ రావు తొలుత కొంతకాలం ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో స్టాఫ్ రిపోర్టర్గా పని చేశారు. 1989లో అదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట ఎస్సైగా పోలీస్ శాఖలో చేరారు. పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. గత నవంబర్ నెలలో కూకట్ పల్లి ఏసీపీగా వచ్చారు. అతని పైన చాలా రోజులుగా ఆరోపణలు ఉన్నాయి.