2300ఎకరాలు కట్టబెట్టారు: సబ్రిజిస్ట్రార్ ఇంట్లో సోదాలు, 100కోట్లకుపైనే ఆస్తులు
హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ అధికారులు(ఏసీబీ) వరుస దాడులతో అవినీతి అధికారులకు నిద్రలేకుండా చేస్తున్నారు. తాజాగా బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ యూసుఫ్ అలీ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని ఆరోపణలు రావడంతో బుధవారం ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు.
యూసుఫ్ తోపాటు అతని బంధువుల ఇళ్లల్లోనూ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, నల్గొండ, సూర్యపేటతోపాటు మొత్తం 9 ప్రాంతాల్లో యూసుఫ్ ఆస్తులపై సోదాలు చేస్తున్నారు.
2,300ఎకరాల భూమిని గోల్డ్ స్టోన్ కంపెనీకి కట్టబెట్టిన కేసులో యూసుఫ్ నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఆయనను బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, యూసుఫ్ ఆస్తులు రూ. వంద కోట్లకుపైనే ఉన్నట్లు ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. భారీగా డబ్బులు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏసీబీ సోదాల్లో లభించినట్లు తెలిసింది.