జల్సాల కోసం సినీ ఫక్కీలో వ్యాపారి కిడ్నాప్: పోలీసులకు చిక్కిన నలుగురు
హైదరాబాద్: జల్సాలు చేసేందుకు సినీ ఫక్కిలో ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ మీడియా సమావేశంలో వివరించారు.
రాజేంద్రనగర్ శాస్త్రీపురానికి చెందిన ఎండీ.వాజిద్(32) కారు మెకానిక్, మహారాష్ట్రకు చెందిన బహుదుర్పురా వాసి సాజిద్ అలీ(32), అదే ప్రాంతానికి చెందిన కూరగాయల వ్యాపారి షేక్ మోయిన్(20), షేక్ మోయిజ్(18) అనే టైలర్ ఓ ముఠాగా ఏర్పాడ్డారు.
వీరిలో సాజిద్ పలు వ్యాపారాలు చేసి తనకు ఉన్న జల్సాలతో అప్పుల పాలయ్యాడు. ఎలాగైన ఓ ధనవంతుడిని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పథకం వేశాడు. మిగతా ముగ్గురితో జత కలిసి పథకాన్ని అమలు చేయడానికి పూనుకున్నాడు. రాజేంద్రనగర్ పరిధిలోని నెక్నపూర్ సమీపంలో ఉన్న అల్కాపురి టౌన్షిప్ వాసి రమేష్ చంద్ అగర్వాల్కు బషీర్బాగ్లో బాలాజీ గ్రాండ్ బజార్ ఉంది.
ప్రతి రోజు రాత్రి వ్యాపారం ముగించుకొని ఇంటికి వస్తాడు. అలా ఈ నెల 14న రాత్రి ప్రమోద్చంద్ను వెంట పెట్టుకొని ఐ-20 కారులో బయల్దేరాడు. ఇన్నోవా వాహనంలో నిందితులు వారిని వెండించి నెక్నాపూర్ వద్ద వారు వెళ్తున్న కారు ముందుకు చేరుకుని రమేష్ అగర్వాల్ను కిడ్నాప్ చేశారు. వాహనంలో 20 వేల నగదు, ఓ మొబైల్ను దొంగిలించారు. ప్రమోద్ ఇంటికి చేరుకున్నాడు.
ఆ తర్వాత కిడ్నాపర్లు రమేష్ అగర్వాల్ కుమారుడు అంతిష్కు ఫోన్ చేసి రూ. 2 కోట్లు డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తామని బెదిరించారు. దీంతో అంతిష్ ఒప్పుకున్నాడు. పోలీసులకు సమాచారంతోపాటు వారు మార్చిమార్చి వాడుతున్న ఫోన్ల నంబర్లు ఇచ్చాడు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో కిడ్నాపర్లు చెప్పిన ప్రకారం ఆరాంఘర్ చౌరస్తా చేరుకున్నారు.
ముందుగా పోలీసులతో అక్కడికి చేరుకున్న అంతిష్ వారి వద్దకు వెళ్లగానే పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల విచారణలో నేరం రుజువైంది. ఈ మేరకు నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి టాయ్ పిస్టోల్, ఇన్నోవా వాహనం, చిన్నకత్తి, 20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.