భయపడను: నటి పూజిత ఇష్యూలో ట్విస్ట్, తెరపైకి మరో ఐఏఎస్, '12ఏళ్లు సహజీవనం'
హైదరాబాద్: నటి పూజిత, ఆమె భర్త విజయ్ గోపాల్ ఐఏఎస్ అధికారిణిని పెళ్లి చేసుకున్న వ్యవహారం మలుపులు తిరుగుతోంది. విజయ గోపాల్ ఓ ఐఏఎస్ అధికారిణిని పెళ్లి చేసుకున్నాడని, తనను మోసం చేశాడని, తనను హతమార్చాలని చూస్తున్నారని పూజిత ఆరోపించిన విషయం తెలిసిందే.
తన భర్తను అరెస్టు చేసేందుకు తన వద్ద ఆధారాలున్నాయన్నారు. ఆమె నగర కమిషనర్ మహేందర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా... పూజిత భర్తను అరెస్ట్ చేసేందుకు తగిన ఆధారాలు తీసుకురావాలని ఆయన సూచించారు.
ఈ నేపథ్యంలో ఈ రోజు విజయ్ తన భర్తే అనేందుకు కావాల్సిన ఆధారాలన్నీ కమిషనర్కు అందచేసినట్లు మీడియాకు చెప్పారు. తన భర్తపై గతంలో క్రిమినల్ కేసులు సైతం నమోదయ్యాయన్నారు. తనకు ప్రాణభయం ఉండడంతోనే ఆరు రోజుల పాటు ఎవ్వరికీ కనిపించకుండా ఉన్నానని తెలిపారు.
తనకు ప్రభుత్వం నుంచి సాయం కావాలన్నారు. ఇక భయపడేది లేదని, తేల్చుకుంటానని చెప్పారు. ఎంతోమందిని మోసం చేసిన అతనిని అరెస్టు చేయాలన్నారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. తన భర్త ఐఏఎస్ రేఖారాణిని పెళ్లి చేసుకున్నారని చెప్పారు. అందుకు సంబంధించి ఆధారాలున్నాయన్నారు. 'మరో' ఐపీఎస్ అధికారిణి నుంచి కూడా తనకు ప్రాణహాని ఉందని చెప్పారు. 'మరో' ఐపీఎస్ అధికారిణి తనను బెదిరించారని, ఆ పెళ్లికి మొదటి సాక్షి కూడా ఆమె అన్నారు.
సహజీవనం చేశా: విజయ గోపాల్
తాను పూజితను అసలు పెళ్లే చేసుకోలేదని విజయ్ గోపాల్ చెబుతున్నారు. ఆమెతో సుమారు పన్నెండేళ్లపాటు సహజీవనం చేశానని, గత ఏడేళ్ల నుంచి పూజితకు దూరంగా ఉంటున్నానని, తమ ఇరువురికి ఒక కొడుకు ఉన్నాడని చెప్పారు.
తనపై ఆరోపణలకు దిగిన పూజిత ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. పూజిత తన నుంచి ఏం కోరుకుంటుందో తెలియట్లేదన్నారు. పూజిత వెనక ఎవరో ఉన్నారని, వారి మాటలు వినే పూజిత తనపై ఆరోపణలు చేస్తోందన్నారు.