అక్కడే నిన్న జూ.ఎన్టీఆర్కు, నేడు ప్రణీతకు ప్రమాదం: నితిన్ పరామర్శ
హైదరాబాద్/విజయవాడ: కథానాయిక ప్రణీత కారు ప్రమాదం నేపథ్యంలో మరోసారి నల్గొండ జిల్లాలోని మోతె జాతీయ రహదారి మలుపు మరోసారి ప్రధానంగా చర్చనీయాంశమయింది. ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రణీత కారు మోతె మలుపు వద్ద ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో ఆమెతో పాటు మరో ముగ్గురు నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఏడేళ్ల క్రితం.. 2009లో తెలుగు సినిమా కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ కారు కూడా ఇక్కడే ప్రమాదానికి గురైంది. నాడు జూ. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు.
ప్రచారం అనంతరం ఆయన హైదరాబాద్ వస్తుండగా మోతె వద్ద ఆయన కారు ప్రమాదానికి గురయింది. ఈ ఘటనలో జూ ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అతను కోలుకున్నాడు. నేడు ప్రణీత, నాడు జూ ఎన్టీఆర్ మోతె వద్ద కారు ప్రమాదంలోనే గాయపడ్డారు.
మోతె మలుపు వద్ద పదేపదే ప్రమాదం జరుగుతుంటుందని, గతంలోను ఇదే ప్రాంతంలో భారీ ప్రమాదాలు జరిగాయని చెబుతున్నారు. ఇక్కడి రోడ్డు నిర్మాణం శాస్త్రీయ పద్ధతుల్లో లేదంటున్నారు. మోతె, మునగాలల వద్ద మూలమలుపులతో కూడిన ప్రదేశాలు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.
ఇక్కడ వాహనాలు వందకు పైగా వేగంతో వెళ్తుంటాయి. ఈ ప్రాంతంలో అండర్ క్రాసింగ్లు లేకపోవడంతో.. జాతీయ రహదారికి అటు వైపు, ఇటువైపు గ్రామాల వారు, ఇతరులు వాహనాలలో లేదా నడుచుకుంటూ ఈ రోడ్డుపై నుంచే దాటుతుంటారు. ఆ సమయంలో మెయిన్ రోడ్డులో వేగంగా వస్తున్న వాహనాలు ఢీకొంటాయి.
వాహనదారులు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పాటు హెచ్చరిక బోర్డులు ఎక్కువగా లేకపోవడం, జీబ్రా క్రాసింగ్ లేకపోవడం, అండర్ క్రాసింగ్లు సరిగా లేకపోవడం కూడా ఈ ప్రమాదాలకు కారణమని చెబుతున్నారు. నాడు జూ.ఎన్టీఆర్, నేడు ప్రణీతల కార్లు ప్రమాదాలకు గురయ్యాయి.
కానీ ఇక్కడ పెద్ద పెద్ద ప్రమాదాలతో పాటు చిన్నచిన్న ప్రమాదాలకు అయితే లెక్కేలేదు. పెద్ద ప్రమాదాలు లేదా ఇలా ప్రముఖులు ప్రమాదాలకు గురైనప్పుడు మాత్రమే ఇది ప్రధానంగా తెరపైకి వస్తోంది. ఇక్కడ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు.
ప్రణీతను పరామర్శించిన హీరో నితిన్
మోతె వద్ద ప్రమాదానికి గురైన నటి ప్రణీతను నటుడు నితిన్ పరామర్శించారు. ఆమె శంషాబాద్ విమానాశ్రయానికి మినీ బస్సులో చేరుకున్నారు. అక్కడి నుంచి చెన్నై బయలుదేరారు. విమనాశ్రయంలో నితిన్ పరామర్శించారు. ఆమెను పలువురు పరామర్శించారు.