డిగ్గీ షాక్: నవాజ్ షరీఫ్ మనవరాలి పెళ్లికి మోడీ, దావూద్ ఇబ్రహీం కూడా
హైదరాబాద్: పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మనవరాలి పెళ్లికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం హాజరైనట్లుతమకు సమాచారం ఉందని, అదే వివాహానికి ప్రధాని మోడీ వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాక్ పర్యటనకు వెళ్లి రాగానే పఠాన్ కోట్ పైన దాడి జరగడం దారుణమన్నారు. పంజాబ్ ప్రభుత్వం ఈ దాడి పైన ఎన్ఐఏ దర్యాఫ్తును వ్యతిరేకించడం పలు అనుమానాలు కలిగిస్తోందని చెప్పారు. స్మగ్లర్లకు సల్వీందర్ సింగ్ సహకరిస్తున్నారని ఆరోపించారు.
ఈ మొత్తం వ్యవహారం పైన సమగ్ర దర్యాఫ్తుకు ఆదేశించాలని డిగ్గీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అవినీతి వ్యవహారాన్ని ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదన్నారు. టెండర్లు లేకుడా రూ.10వేల కోట్ల కాంట్రాక్టులు ఏవిధంగా ఖరారు చేస్తారని ప్రశ్నించారు.
డిగ్గీ ఇంకా మాట్లాడుతూ... ఓటుకు నోటు కేసులో కెసిఆర్, చంద్రబాబు మాటలు ప్రజలు మర్చిపోలేదని, ఇప్పుడు వారిద్దరు ఒకరినొకరు పొగుడుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. తెలంగాణ ఇస్తే తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని కెసిఆర్ చెప్పి మాట మార్చారన్నారు.
తెరాస అధికారం, ఆర్థిక అండదండలతో ప్రలోభ పెడుతోందన్నారు. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కెసిఆర్ యూటర్న్ తీసుకోవడంలో నిపుణులు అని ఎద్దేవా చేశారు. సెటిలర్లను నానా మాటలు అన్న కెసిఆర్, కెటిఆర్ ఇప్పుడు ఓట్ల కోసం ప్రేమ కురిపిస్తున్నారన్నారు.