రూ.30వేలకు మించి ఇవ్వలేం: చేతులెత్తేస్తున్న బ్యాంకులు.. అసహనంలో సామాన్యుడు..
ఇదే పరిస్థితి ఇకముందు కూడా కొనసాగితే మరిన్ని కరెన్సీ కష్టాలు తప్పవని బ్యాంకర్లు చెప్పుకొస్తున్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలో నగదు కొరత కష్టాలు సామాన్యులను వెంటాడుతూనే ఉన్నాయి. ఏటీఎంలలో ఎక్కడా డబ్బు లేకపోవడం.. బ్యాంకులు సైతం పరిమిత మొత్తాన్ని మాత్రమే ఇస్తుండటంతో కరెన్సీ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. చాలావరకు బ్యాంకులు రూ.30వేలకు మించి నగదును ఇవ్వడం మాతో కాదంటూ చేతులెత్తుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా అన్ని బ్యాంకుల్లోను దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తుండటంతో సామాన్యుడిలో తీవ్ర అసహనం నెలకొంది.
ఆర్బీఐ నుంచి డిమాండ్ మేరకు డబ్బు రాకపోవడం.. బ్యాంకుల నుంచి విత్ డ్రా అవుతున్న సొమ్ము తిరిగి బ్యాంకులకు రాకపోవడంతో ఈ కొత్త కష్టాలు మొదలైనట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. డిపాజిట్లు భారీగా పడిపోవడంతో ఖాతాదారులకు డిమాండ్ మేరకు డబ్బు చెల్లించడం కుదరడం లేదనేది బ్యాంకర్ల వాదన. చలామణిలోకి వచ్చిన కొత్త కరెన్సీ నోట్ల డిపాజిట్లు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు.
ఇదే పరిస్థితి ఇకముందు కూడా కొనసాగితే మరిన్ని కరెన్సీ కష్టాలు తప్పవని బ్యాంకర్లు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా కరెన్సీ విత్ డ్రాపై ఆర్బీఐ ఆంక్షలు ఎత్తేసినా.. బ్యాంకర్ల తీరుతో పరిమితికి మించి డబ్బు పొందలేని స్థితిలో సామాన్యులు ఉన్నారు. దీనికి తోడు కొత్తగా రూ.2లక్షలకు మించి నగదు లావాదేవీలు జరపరాదంటూ మరో కొత్త నిబంధనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అంతకుమించితే 100శాతం జరిమానా తప్పవని కేంద్రం హెచ్చరిస్తోంది.
ఈ నిర్ణయంతో ఇకనుంచి భారీ నగదు లావాదేవీలన్ని ఆన్ లైన్ ద్వారానే చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రజలను బలవంతంగా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ వైపు మళ్లించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పలువురు కేంద్రం చర్యలపై మండిపడుతున్నారు.