రైతు ఆత్మహత్యలపై కల్వకుంట్ల కవితను ఏకేసిన ఆకుల లలిత, సంపత్
హైదరాబాద్ : రూ. 10 కోట్లను బతుకమ్మ ఉత్సవాలకు ఖర్చుపెడుతున్న ప్రభుత్వం సంబురాల పేరుతో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితకు లబ్ధి చేకూర్చేలా చేస్తోందని కాంగ్రెసు ఎమ్మెల్సీ ఆకుల లలిత దుయ్యబట్టారు. ఆమె సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
ఓ పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ వారి కుటుంబాలు పుట్టెడు దు:ఖంలో ఉంటే ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాల పేరుతో నిధులను ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె అడిగారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం తప్పడు లెక్కలు చెబుతోందని లలిత విమర్శించారు.
తెలంగాణలో జరుగుతున్న రైతులు ఆత్మహత్యలపై టీఆర్ఎస్ ఎంపీ కవిత తప్పడు లెక్కలు చెబుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీపై టీఆర్ఎస్ ప్రభుత్వం డొంక తిరుగుడు వైఖరిని అవలంభిస్తోందని విమర్శించారు.
రైతుల సమస్యలను పరిష్కరించాలని తమ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భరోసా యాత్రలు జరుగుతుంటే వాటిని విమర్శించడం సరికాదన్నారు. అలాగే సినిమాల విడుదలను అడ్డుకుని అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డ ఎంపీ కవిత ఇప్పటికీ అదే పరంపరను కొనసాగిస్తున్నారని, రైతు కుటుంబాలను ఆదుకుంటామంటూ జాగృతి పేరుతో కలెక్షన్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డ దృష్ట్యా కరువు మండలాలను గుర్తించి ప్రకటించాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ఆచార్య కోదండరాం అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో కరువు పరిస్థితిని పరిశీలించేందుకు తరాజ్ అభియాన్తో రైతు సంవేదన యాత్రలో పాల్గొన్నామన్నారు.
రైతు సంక్షేమంపై ప్రభుత్వాలు అనుకూల దృక్పథంతో వ్యవహరించాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తగిన విధంగా స్పందించి సాయం అందివ్వాలని కోదండరామ్ అన్నారు.