నేరెళ్ల ఘటన: "ఇసుక మాఫియాతో కెటిఆర్కు సంబంధాలు"
నేరెళ్ల ఘటనపై అఖిలపక్ష నేతలు సోమవారంనాడు గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి, కోదండరాం.
హైదరాబాద్: నేరెళ్ల ఘటనపై అఖిలపక్ష నేతలు సోమవారంనాడు గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి, కోదండరాం, చాడా వెంకటరెడ్డి ఆ మేరకు గవర్నర్ను కలిశారు.
గవర్నర్ను కలిసిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. నేరెళ్ల సంఘటనపై స్వతంత్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. బాధితులకు తగిన పరిహారం ఇవ్వాలని కోరారు. తెలంగాణలో దళితుల జీవితాలకు విలువ లేకుండా పోయిందని వారు అన్నారు.
ఇసుక మాఫియాతో మంత్రి కేటీఆర్కు సంబంధాలున్నాయని ఆరోపించారు. దళితులపై దాడి విషయంలో ఎస్పీని కెటిఆర్ కాపాడుతున్నారని వారు ఆరోపించారు. దాడిలో ఎస్పీ నేరుగా పాల్గొన్నారని వారు చెప్పారు. దాడి చేసిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. లారీల కాల్చివేతతో సంబంధంలేని ఎనిమిది మంది అమాయకులను అరెస్టు చేశారని తెలిపారు.
సిఎం కుటుంబ సభ్యులకు సంబంధాలు...
నేరెళ్లలో దళితులపై దాడుల విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. ఇసుక మాఫియాలో ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారని ఆయన ఆరోపించారు. వారిని కాపాడేందుకు దళితులను బలి చేస్తున్నారని ఆరోపించారు. ఎస్పీతో సహా సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని గవర్నర్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
నెల తర్వాతనా....
నేరెళ్లకు నెల తర్వాత మంత్రి కేటీఆర్ వెళ్లడం దారుణమని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ ఘటనకు బాద్యులైన వారిపై ఎస్పీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో వందశాతం ఇసుక మాఫియా నడుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
చేతులు దులుపుకుంటున్నారు...
నేరెళ్ల ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఎస్ఐని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలనుకుంటున్నారని అన్నారు. ఎస్పీపై చర్యలు తీసుకోవాలని, న్యాయవిచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసమే...
ఇసుక కాంట్రాక్టర్లకు ప్రయోజనం కోసమే దళితులపై దాడి చేశారని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ ఆరోపించారు. ఈ ఘటనపై ఏ యంత్రాంగమూ ఇంత వరకూ స్పందించలేదని ఆయన తెలిపారు. గవర్నర్ ఇచ్చిన హామీ నెరవేరుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఇసుక మాఫియా ఆగేవరకు పోరాడతామని తెలిపారు.