ఓయు శతాబ్ది ఉత్సవాలు: కేసీఆర్కు విద్యార్థుల వార్నింగ్, ప్రణబ్కు ఓకే
ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది వేడులను బుధవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభిస్తారు.
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది వేడులను బుధవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు.
క్రీడా సముదాయం, వసతి గృహాలు, శతాబ్ది భవనం, పైలాన్ నిర్మాణాలకు శంకుస్థాపన చేసి కీలకోపన్యాసం చేస్తారు.
ఇందుకోసం అంతకుముందు, ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ మధుసూదనా చారి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు ఘన స్వాగతం పలికారు.
ఓయులో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతితోపాటు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఓయూ ఉపకులపతి రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన వేదికను వర్సిటీ ఆవరణలోని ఏ మైదానంలో ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తొలుత అమరవీరులకు నివాళి అర్పించారు.
మధ్యాహ్నం మూడు గంటలకు ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో ఎంపీ కేశవరావు అధ్యక్షతన సదస్సు ఉంటుంది. ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి హాజరవుతారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపై జరుగుతాయి. శతాబ్ది వేడుకల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ప్రణబ్ హయాంలో మూడోది..
గత ఏడాది మే 12న బెనారస్ వర్సిటీ శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు. మైసూరు విశ్వవిద్యాలయానికి ఆహ్వానం అందింది. అనివార్య కారణాల వల్ల ఆయన వెళ్లలేకపోయారు. ఇప్పుడు ఓయుకు వచ్చారు. మూడు విశ్వవిద్యాలయాలూ ప్రణబ్ ముఖర్జీ హయాంలోనే శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం విశేషం.
డీజీపీ పరిశీలన
ఇదిలా ఉండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఓయూలో పోలీస్ ఉన్నతాధికారులు రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఓయూ పరిసర ప్రాంతాల్లో 2500 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించారు. ముందు జాగ్రత్త చర్యలు, వేదిక వద్ద భద్రతను డీజీపీ అనురాగ్ శర్మ పరిశీలించారు.
పోలీసుల అదుపులో విద్యార్థులు?
ఓయూలో సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు సుమారు రెండు వందల మంది విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. పోలీస్ అధికారులు మాత్రం తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు.
ఓయులో బుధవారం ఉద్రిక్తత
ఓయులో బుధవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సీ హాస్టల్ను టాస్క్ఫోర్స్ పోలీసులు చుట్టుముట్టారు. ప్రతి గదిని తనిఖీ చేసి, ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
తమ డిమాండ్లకు స్పష్టమైన హామీ ఇచ్చాకే కేసీఆర్ ఓయులో అడుగు పెట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓయు శతాబ్ది ఉత్సవాలకు తాము వ్యతిరేకం కాదని, రాష్ట్రపతి ప్రణబ్ను స్వాగతిస్తామని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి.