తుపాకీతో కాల్చి చంపేస్తా: ఏపీ అధికారి బెదిరింపు! హైద్రాబాద్లో కేసు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారి ఒకరి ఉద్యోగాల పేరుతో కుచ్చుటోపి పెట్టడమే కాకుండా, బాధితులను తుపాకీతో కాల్చి చంపుతానని బెదిరించినట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ఏపీ డిప్యూటీ సెక్రటరీ అని చెబుతున్నారు. పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తానని అతను చెప్పాడని అంటున్నారు. ఉద్యోగాలు మాత్రం రాలేదు. దీంతో బాధితులు అతనిని నిలదీశారు. వారు నిలదీస్తే తుపాకీతో కాల్చి చంపుతానని బెదిరించారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి బాధితులు మీర్ పేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు.
సదరు ఉద్యోగి పేరు శ్రీనివాసులు అని తెలుస్తోంది. ఉద్యోగం ఇప్పిస్తానని రెండేళ్ల క్రితం మల్లికార్జున్ అనే నిరుద్యోగి నుంచి ఏపీ సచివాలయ ఉద్యోగి అయిన శ్రీనివాసులు రూ.2.50 లక్షలు వసూలు చేశారు. చాలా రోజులు కావడంతో డబ్బులివ్వాలని మల్లికార్జున్ కోరారు. ఆగ్రహించిన శ్రీనివాసులు.. మల్లికార్జున్ను తుపాకీతో బెదిరించాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.