ప్రశ్నించండి: మేధావులకు షా, కవిత.. కేటీఆర్.. బీజేపీ చీఫ్పై ఆసక్తికర ప్రశ్న
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సోమవారం నల్గొండలో మేథావులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఆసక్తికర ప్రశ్న అడిగారు.
నల్గొండ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సోమవారం నల్గొండలో మేథావులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఆసక్తికర ప్రశ్న అడిగారు.
బీజేపీలో తదుపరి రాష్ట్ర అధ్యక్షులు ఎవరు అవుతారో చెప్పాలన్నారు. మళ్లీ ఆయనే మాట్లాడుతూ.. తెరాసలో కేసీఆర్ తర్వాత కేటీఆర్, కవితల పేర్లు వినిపిస్తాయని, కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ అని, కానీ బీజేపీలో మాత్రం పని చేసే వారే పదవులు పొందుతారన్నారు.
దక్షిణాదిన తెలంగాణ నుంచి సమరశంఖం పూరిద్దామని చెప్పారు. తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంటే నిధులు దుర్వినియోగం కావని చెప్పారు.
మేధావులు ఎవరైనా తమ తప్పులు ఉంటే నిర్భయంగా చెప్పవచ్చునని, తమ వైపు నుంచి తప్పులు ఉంటే సరిదిద్దుకుంటామని చెప్పారు. మేధావులు మౌనంగా ఉండవద్దన్నారు.
బీజేపీలో ఉన్న ప్రజాస్వామ్యం ఏ పార్టీలో ఉండదని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రం ప్రవేశపెట్టిన 106 పథకాలను చదివి వినిపించారు. ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా ఉండేలా ప్రధాని నరేంద్ర మోడీ పాలన కొనసాగిస్తున్నారన్నారు.