ఇదీ అమిత్ షా, బిజెపి వ్యూహం: కేసీఆర్ ఆ సవాల్ వెనుక..., ఆత్మరక్షణలో టిఆర్ఎస్
హైదరాబాద్: బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలుగు రాష్ట్రాల పర్యటన వేడిని రాజేసింది. ఆయన పర్యటన తెలంగాణ, ఏపీలలోని ఆ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తెలంగాణలో ఓ విధమైన రాజకీయ వేడిని, ఏపీలో మరో రకమైన వేడిని ఈ టూర్ రాజేసింది.
చదవండి: కేసీఆర్కు బీపీ పెరుగుతోందన్న అమిత్ షా
ఏపీలో టిడిపితో పొత్తు అంశంపై సర్వత్రా ఉత్కంఠ కనిపించింది. చివరకు మరో రెండేళ్ల పాటు ఇరు పార్టీలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాయి. తెలంగాణలో మాత్రం బిజెపి - తెరాస మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. స్వయంగా కేసీఆర్ - అమిత్ షాలు సవాళ్లు విసురుకున్నారు.
బిజెపిని తుంచేసేందుకే
అమిత్ షా గతంలోను తెలంగాణలో పర్యటించారు. ఈసారి పర్యటించారు. అయితే కేసీఆర్ ఈ పర్యటనను సీరియస్గా తీసుకొని, ఆయనకు కౌంటర్ ఇచ్చేందుకు స్వయంగా సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టారు. బిజెపిని ఆదిలోనే అడ్డుకోవాలనే ఉద్దేశ్యంలో భాగంగానే ఆయన ప్రెస్ మీట్ పెట్టారని అంటున్నారు.
ఇదీ అమిత్ షా..!
కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ దూసుకెళ్తోంది. అలాగే, వ్యూహరచనలో అమిత్ షా పక్కాగా ముందుకెళ్తారు. ఆయన వ్యూహంతో ముందుకు వెళ్తే బిజెపి పట్టు సాధించడం ఖాయమని ఆ పార్టీ కార్యకర్తలు బలంగా నమ్ముతారు. లోకసభ ఎన్నికల తర్వాత మోడీ - అమిత్ షాల వ్యూహంతో బిజెపి పట్టు సాధించిన, గెలిచిన రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. చివరకు పశ్చిమ బెంగాల్లోను దూసుకెళ్తున్నారు. నిన్నటి దాకా అక్కడ సిపిఎం వర్సెస్ మమతా బెనర్జీ. కానీ ఇప్పుడు బిజెపి రంగంలోకి వచ్చింది.
తెలంగాణపై కన్ను.. కేసీఆర్ ఆగ్రహం అక్కడే
ఇప్పుడు అదే అమిత్ షా కన్ను తెలంగాణపై పడింది. ఇక్కడ తెరాసకు ఇప్పటికే మేం ప్రత్యామ్నాయమంటే మేము అని టిడిపి, కాంగ్రెస్, బిజెపిలు చెబుతున్నాయి. బిజెపి చాపకింద నీరులా ఎదుగుతోంది. అమిత్ షా పర్యటన కూడా కొత్త ఉత్సాహాన్ని నింపింది. కేసీఆర్కు అదే భయం పట్టుకుందని అంటున్నారు. బిజెపిని ఎదగనిస్తే తమకు మొదటికే మోసం వస్తుందని తెరాస భావిస్తోందని అంటున్నారు.
నష్టమని రంగంలోకి కేసీఆర్
ఇప్పటికే కేసీఆర్ పాలనపై పలు పార్టీలు, సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఒక్కటవుతున్నాయి. ఇలాంటి సమయంలో బిజెపి కూడా ఎదిగితే తెరాసకు నష్టమే. ఈ భయమే కేసిఆర్కు ఆగ్రహం తెప్పించి, అమిత్ షా పర్యటన విషయంలో స్వయంగా రంగంలోకి దిగేందుకు కారణమయిందని అంటున్నారు.
ఇదీ అమిత్ షా వ్యూహం.. తెరాస భయం
ఓ విధంగా బిజెపి ఎదుగుదల తమకు నష్టం కలిగిస్తున్న భయం తెరాసకు పట్టుకుందని అంటున్నారు. సాధారణంగా అమిత్ షా వ్యూహాల్లో.. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను లాగడం, తద్వారా ఆ పార్టీని బలహీనపర్చడం. తెరాస నుంచి కూడా పలువురు కీలక నేతలు తమ పార్టీలోకి వస్తారని బిజెపి నేతలు చెబుతున్నారు.
మైండ్ గేమ్ అయినా.. నిజమైనా..
తెరాస నుంచి తమ పార్టీలోకి వస్తారని బిజెపి నేతలు చెప్పేది మైండ్ గేమ్ అయినా, వాస్తవం అయినా అది ప్రజల్లోకి వెళ్తే తెరాసకు నష్టమే. ఈ కారణంతోనే బిజెపి లేదా అమిత్ షా దూకుడుకు కళ్లెం వేయాలని కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఆయన దుమ్ము దులిపారంటున్నారు. మొత్తానికి బిజెపి నుంచి వచ్చే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన కేసీఆర్ జాగ్రత్తపడ్డారంటున్నారు.
రాజీనామా సవాల్.. కేసీఆర్ రాజకీయ చతురత
అమిత్ షా అన్నీ అబద్దపు లెక్కలు చెప్పారని, తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చినట్లు అబద్దం చెబుతున్నారని, నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని కూడా సవాల్ విసిరారు. ఈ సవాల్ మామూలు విషయం కాదు. అయితే, ఆ తర్వాత తాను అన్న లక్ష కోట్ల మాటలకు కట్టుబడి ఉన్నానని, నిరూపిస్తామని అమిత్ షా, బిజెపి నేతలు చెప్పడం వేరే విషయం. మరో విషయం ఏమంటే అమిత్ షాను తిట్టిన కేసీఆర్, అదే నోట ప్రధాని మోడీని పొగిడారు. మోడీ మంచివారని, అవినీతిరహిత పాలన అందిస్తున్నారని కితాబిచ్చారు. ఇది ఆయన రాజకీయ చతురత అంటున్నారు.