ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వర రావు కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వర రావు ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. పూర్థోదయా మూవీస్ క్రియేషన్స్ పతాకంపై ఆయన పలు కళాత్మక చిత్రాలను నిర్మించారు. ఆయన వయస్సు 82 ఏళ్లు.
ఆయన భౌతిక కాయానికి హైదరాబాదులోని ఫిల్మ్నగర్లో గల నివాసానికి తరలించారు. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగరసంగమం, సితార, సీతాకోకచిలుక, సిరిసిరిమువ్వ, స్వయంకృషి, అపద్భాంధవుడు వంటి పలు చిత్రాలను ఆయన నిర్మించారు. ఆయన అంత్యక్రియలు రేపు (సోమవారం) సాయంత్రం మహాప్రస్థానంలో జరుగుతాయి.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆయన 1934 ఏప్రిల్ 24వ తేదీన జన్మించారు. డబ్బింగ్ ఆర్టిస్టు ఆయన కెరీర్ను ప్రారంభించారు. నిర్మాత యు. విశ్వేశ్వరరావు అనువదించిన పార్వతీ కళ్యాణం చిత్రంలో శివుడి పాత్రధారికి ఆయన తొలిసారి డబ్బింగ్ చెప్పారు. ఎన్టీఆర్ నటించిన ఆత్మబంధువు చిత్రంతో ఆన తెర వెనుక నుంచి తెరపైి వచ్చారు.
1964, 1974 మధ్య కాలంలో ఆయన దాదాపు 30 చిత్రాల్లో వేషాలు వేశారు. వందకు పైగా చిత్రాల్లో డబ్బింగ్ చెప్పారు. ఆయనకు శ్రీ వెంకటేశ్వర కల్యాణం పేరుతో విడుదలైన అనువాద చిత్రం ఆయనకు లాభాలు తెచ్చి పెట్టింది. 1976లో విడుదలైన సిరిసిరిమువ్వ చిత్రం విజయంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది .ఆ తర్వాత ఆయన పూర్థోదయ ఆర్ట్ పిక్చర్ సంస్థలను నెలకొల్పారు. ఆ బ్యానర్పై నిర్మించిన తాయారమ్మ - బంగారయ్య చిత్రంతో ఆయన జైత్రయాత్ర ప్రారంభమైంది.