నెల రోజులు: కొలిక్కిరాని కార్పొరేటర్ మురళి హత్య కేసు
వరంగల్: వరంగల్ నగర పాలక సంస్థ 44వ డివిజన్ కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్య జరిగి నెల రోజులైంది. ఇప్పటి వరకు పోలీసులు ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు హత్య చేసిన తరువాత పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయిన వారు కాగా, 15 రోజుల తరువాత మరో ఇద్దరిని ఆ తర్వాత అరెస్టు చేసి జైలుకు పంపించారు.
హత్య కేసుతో మరో ముగ్గురికి సంబంధం ఉండి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. జులై 13న సాయంత్రం మురళిని హత్య చేసిన తరువాత పోలీసులకు లొంగిపోయిన నిందితుల వాంగ్మూలం నమోదు చేసుకున్న పోలీసులు అందులో ప్రముఖ రాజకీయ నాయకుడి పేరును కేసు డైరీలో (సీడీఫైల్)లో పొందుపర్చి కోర్టుకు సమర్పించారు.
మురళి హత్యకు పక్కా ప్లాన్: 24 కత్తిపోట్లు, వైద్యులే నివ్వెరపోయారు....
మరో ఇద్దరు వ్యక్తుల పేర్లను కూడా సీడీ ఫైల్లో పొందుపర్చారు. ఈకేసు సంచలనం కలిగించడం వలన పోలీసు ఉన్నధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. విచారణను అత్యంత రహస్యంగా చేస్తున్నారు. ముగ్గురు నిందితులు చెప్పిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. సాక్ష్యాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. పలువురిని విచారిస్తున్నారు. పోలీసు ప్రత్యేక విభాగం ద్వారా సమాచారం సేకరిస్తున్నారు.
నిందితులు నగరం విడిచి వెళ్లారు...
అనుమానిస్తున్న నిందితులు మాత్రం ప్రస్తుతం వరంగల్ నగరం విడిచి వెళ్లారు. వారు ఉన్నత న్యాయస్థానం నుంచి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. దానిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇందుకోసం న్యాయసలహాలు తీసుకొని ముందుకు వెళుతున్నారు. నిందితులకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మురళి హత్య కేసును ఏసీపీ స్థాయి అధికారి ప్రత్యేకంగా విచారణ చేస్తున్నారు.ఈ అధికారికి గతంలో పలు కీలకమైన కేసులను ఛేదించిన అనుభవం ఉండడంతో ఆయన ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఎక్కడ న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా కేసును విచారణ చేస్తున్నారు.
సాంకేతిక పరిజ్ఞానంతో
అధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత పోలీసులు పలు కేసులను సులువుగా సాక్ష్యాధారాలతో న్యాయస్థానాల ముందు నిలబెట్టారు. మురళి హత్య కేసులో కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నారు. నిందితులు హత్యకు ముందు ఎక్కడెక్కడ ఉన్నారు. ఎవరితో ఫోన్లలో సంబాషించారు.. వారు ఏమి మాట్లాడారు.. హత్యకు ముందు వీరికి ఎవరైనా సహాయం చేశారా లేదా ఆశ్రయం కల్పించారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
ఫోన్ నెంబర్ల సేకరణ
ఫోన్ నెంబర్లను సేకరించారు. మిగిలిన ముగ్గురు నిందితులకు సంబంధించి వారికి ఏదైనా సాక్ష్యం లభిస్తే వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు బయటకు చెప్పడం లేదు. హత్య జరిగిన సమయంలో అక్కడ ఎవరైనా ఉన్నారా ఉంటే వారు అక్కడికి ఎప్పుడు వచ్చారు.
ఏం మాట్లాడారు...
మురళితో అక్కడ ఉన్నవారు ఏమి మాట్లాడారు అనే కోణంలో పోలీసులు పలువురిని విచారించారు. త్వరలోనే ఈకేసును కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మిగిలిన నిందితులకు సంబంధించిన సాక్ష్యాలను సంప్రదిస్తే వారిని వెంటనే అరెస్టు చేసే అవకాశం ఉంది. లేదంటే కేసు విచారణ మరింత జాప్యం జరుగుతుందని పోలీసు అధికారి అంటున్నారు.