చంద్రబాబుకు మరో షాక్: తెరాసలోకి నారాయణపేట ఎమ్మెల్యే
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి షాక్ మీద షాక్ తగులుతోంది. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ బుధవారం రాత్రి తెరాసలో చేరగా కొన్ని గంటల వ్యవధిలోనే మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట్ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కారెక్కుతున్నట్టు ప్రకటించారు.
గురువారం రాత్రి తెలంగాణ మంత్రులతో భేటీ తర్వాత ఈ నిర్ణయం ప్రకటించారు. ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో ఫోన్లో మాట్లాడానని, ఢిల్లీ పర్యటననుంచి ఆయన తిరిగిరాగానే అధికారికంగా పార్టీలో చేరుతానని చెప్పారు. తెలంగాణలో టీడీపీకి ఉనికి లేకుండా పోయిందన్నారు.
కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, అందుకే పార్టీలో చేరుతున్నానని తెలిపారు. తనకు నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యమన్నారు.
ఎర్రబెల్లి, ప్రకాష్ గౌడ్ తెరాసలో చేరిన తర్వాత టిడిపి నేతలకు భరోసా ఇవ్వడానికి చంద్రబాబు గురువారం రాత్రి ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో సమావేశం నిర్వహించిన నేపథ్యంలోనే రాజేందర్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు చెప్పడం గమనార్హం.
రాజేందర్రెడ్డి చేరికతో టీడీపీనుంచి మొత్తం 10 మంది ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీలో చేరినైట్లెంది. దీనితో టీడీపీ ఎల్పీ టీఆర్ఎస్ఎల్పీలో విలీనమయ్యేందుకు మార్గం సుగమమైంది.