రిలీవ్ అయిన ఉద్యోగులను చేర్చుకోవద్దు: టీ ఉద్యోగులు
హైదరాబాద్: తెలంగాణ జెన్కో నుంచి రిలీవ్ చేసిన ఏపీ ఉద్యోగులను బదలాయించే ప్రయత్నాలను నిరసిస్తూ కెపిటీఎస్ ఎదుట తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఏపీ ఉద్యోగులను స్థానికత ఆధారంగా ఏపీలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. ఏపీ ఉద్యోగులు తెలంగాణకు వస్తే తీవ్ర పరిణామాలుంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
స్థానికత ఆధారంగానే ఉద్యోగులను విభజించాలి: రాజీవ్ శర్మ
స్థానికత ఆధారంగానే ఉద్యోగులను విభజించాలన్నది తెలంగాణ ప్రభుత్వ నిర్ణయమనీ, ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖకు తెలియజేశామనీ తెలంగాణ సీఎస్ రాజీవ్శర్మ స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల ఆధ్వర్యంలో ఉద్యోగుల విభజనకు కమిటీ వేయాలని కేంద్రహోంశాఖ సూచించిందని ఆయన తెలిపారు.
కోర్టు నిర్ణయానికి అనుగుణంగానే మేం నడుచుకుంటామనీ, కోర్టులను మేము నమ్ముతామని ఆయన చెప్పారు. ఏపీ ప్రభుత్వం మొండివాదనతో ముందుకెళ్తుందని రాజీవ్ శర్మ ఆరోపించారు.
ఉల్లిగడ్డ ధరలపై టిడిపి
ఉల్లిగడ్డ ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ టీడీపీ మహిళా నేత పాల్వాయి రజనీ కుమార్ శుక్రవారం మండిపడ్డారు. మిషన్ కాకతీయతో హరీష్ రావు హైలైట్ అయ్యారనీ, గ్రామజ్యోతితో కేటీఆర్కు ప్రచారం కల్పించే యత్నం చేస్తున్నారన్నారు. వీటితో ప్రజలకు ఒరిగేదేం లేదన్నారు.
టిఆర్ఎస్పై లక్ష్మణ్ నిప్పులు
మజ్లిస్ పార్టీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా అధికార టిఆర్ఎస్ మౌనంగా ఎందుకు ఉంటుందని బీజేపీ శాసన సభా పక్ష నేత లక్ష్మణ్ వేరుగా ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, మజ్లిస్ పార్టీల మధ్యే పోటీ ఉంటుందన్నారు.
గతంలో బీజేపీ మద్దతుతోనే టీడీపీ గ్రేటర్లో గెలిచిందన్నారు. జగ్గారెడ్డికి రాజకీయభిక్ష పెట్టింది బీజేపీయేనని చెప్పారు. ఆయన అవకాశవాది అన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాను స్పీకర్ ఆమోదించాలని డిమాండ్ చేశారు. సనత్నగర్లో పోటీ చేసి అధికార పార్టీని ఓడిస్తామన్నారు. సెప్టెంబర్ 17ను విమోచనదినంగా జరపాలన్నారు.