హైద్రాబాద్పై ఏపీకీ హక్కు ఉంది, తెలంగాణ ఇబ్బంది పెడుతోంది: బాబు
విజయవాడ: హైదరాబాదు పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా హక్కులు ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం లేనిపోని ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆయన విలేకరులతో మాట్లాడారు.
యాభై అరవై ఏళ్లు హైదరాబాదులో ఉండి కట్టుబట్టలతో ఏపీకి వచ్చేశామన్నారు. విభజన తీరు వల్ల మనం ఎంతో బాధపడ్డామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కొట్లాడితే వచ్చేది ఏమీ లేదన్నారు. కాబట్టి మాకు న్యాయం చేయాలని తాను కేంద్రాన్ని కోరానని చెప్పారు.
ఇతర రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చే వరకు తమకు సాయం చేయాలని కోరామన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వండి, ప్యాకేజీ ఇవ్వండి కానీ ఇతర రాష్ట్రాలతో సమానంగా వచ్చే వరకు తమకు సాయం చేయాలని చెప్పానన్నారు.
తనకు ఎవరితోను రాజీపడాల్సిన అవసరం లేదని, నా విశ్వసనీయతనే తనకు శ్రీరామ రక్ష అన్నారు. విభజన చట్టంలో పెట్టిన హామీలు, ఆర్థిక సాయం అవసరమని చెప్పారు. ఎవరూ ఆధైర్యపడవద్దని, అందరం కలిసి సాధించుకుందామని చెప్పారు.