పదో షెడ్యూల్ సంస్థలపై గవర్నర్ ఎదుట పంచాయితీ: మాకేనని తెలంగాణ, కాదని ఏపీ
హైదరాబాద్: పదో షెడ్యూల్లో ఉన్న సంస్ధలన్నీ తమకే చెందుతాయని తెలంగాణ సర్కార్ మరోసారి తన వాదనను వినిపించింది. ఏపీ ఉన్నత విద్యామండలి కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న పదో షెడ్యూల్ సంస్థలన్నీ తెలంగాణ ప్రభుత్వ నియంత్రణలోనే పనిచేస్తాయని తేల్చిచెప్పింది.
ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనవసరంగా రాద్దాంతం చేస్తుందని చెబుతోంది. గవర్నర్ నరసింహాన్కు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మంగళవారం ఈ మేరకు నివేదించారు. మంగళవారం ఉదయం రాజ్ భవన్కు వెళ్లిన ఆయన ఈ అంశంపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
అపాయింటెడ్ డే నుంచి ఏడాదిలోపు ఏపీ ప్రభుత్వం సొంతంగా ఆయా సంస్థలని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని, ఏడాది దాటి పోయినందున అవన్నీ తెలంగాణ ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చాయని ఆయన వివరించారు.
పదో షెడ్యూల్లోని సంస్థల సేవలు కావాలంటే ఏపీ ప్రభుత్వం నిర్వహణ వ్యయాన్ని భరిస్తూ ఎంవోయూ కుదుర్చుకోవాల్సిందేనని ఆయన తెలిపారు. గవర్నర్కు రాజీవ్శర్మ నివేదించిన అంశాలను తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అడ్వకేట్ జనరల్ పరాంకుశం వేణుగోపాల్తో సంప్రదింపులు జరిపింది.
దీంతో ఆయన తెలంగాణ సర్కార్ వాదన తప్పని, హైకోర్టు తీర్పు ఉన్నత విద్యా మండలికి మాత్రమే వర్తిస్తుందని, మిగతా సంస్థలకు కాదని స్పష్టంచేశారు. దీంతో ఇదే విషయంపై గవర్నర్ ఎదుట తమ వాదనలు వినిపించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, అడ్వకేట్ జనరల్ గురువారం గవర్నర్తో సమావేశమై ఏపీ ప్రభుత్వ వాదనను వినిపించనున్నారు.