ఒకే ఇంట్లో రెండుసార్లు: దోచుకెళ్తున్నా.. క్షమించండంటూ రాసిన దొంగ
హైదరాబాద్: ఒకే ఇంట్లో రెండు సార్లు దొంగతనం చేశాడు ఓ దొంగ. అంతేకాదు ఇంట్లోకి ప్రవేశించి విలువైన వస్తువులను దొంగిలించి వెళుతూ వెళుతూ గోడపై సారీ అంటు రాశాడు. పోలీసులకే సవాల్గా మారిన ఈ చోరీ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని బీఎన్రెడ్డి కాలనీ ప్లాట్నెం 36లో వ్యాపారి ప్రదీప్ రంగనాధన్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి ఇంట్లోకి అక్టోబర్ 31వ తేదీన ఓ ఆగంతకుడు ఇంట్లోకి ప్రవేశించి బెడ్రూమ్లోని బీరువాలో ఉన్న అమెరికన్ డాలర్లు, బంగారు ఆభరణాలు, కెమెరాలు, ఐఫోన్లు దొంగిలించాడు.
ఈ దొంగతనం చేసినందుకు గాను క్షమాపణలు చెబుతూ గోడపై స్కెచ్పెన్తో 'సారీ' అంటూ రాసి పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్లూస్ టీం, క్రైం పోలీసులు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించారు. ఇలా దర్యాప్తు జరుగుతుండగానే, బుధవారం రాత్రి అదే దొంగ మరోసారి ఇంట్లోకి ప్రవేశించి విలువైన ఆభరణాలతో పాటు లాకెట్, రూ.6వేల నగదు ఎత్తుకెళ్లాడు.
మొదటిసారి దొంగతనానికి వచ్చినప్పుడు ఎక్కడైతే సారీ అంటూ రాశాడో అదే ప్రాంతంలో మళ్లీ సారీ అంటూ రాసి పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన క్రైం పోలీసులు క్లూస్ టీం సంఘటనా స్థలంలో వేలిముద్రలను సరిచూడగా రెండుసార్లు వచ్చింది ఓకే వ్యక్తి అని తేలింది.
దీంతో ఈ దొంగతనాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.