ఆంధ్రా పోలీసులు తెలంగాణలో ఉండడానికి వీల్లేదు , ఎందుకంటే ?
ఆంద్రప్రాంతానికి చెందిన ఏ ఒక్క ఉద్యోగి కూడ తెలంగాణ లో ఉండడానికి వీల్లేదని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి చెప్పారు.
హైదరాబాద్ :ఆంద్రప్రదేశ్ పోలీసులు ఎవ్వరూ కూడ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగడానికి వీల్లేదని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి చెప్పారు. ఇరు రాష్ట్రాల మద్య ఉద్యోగుల విభజన కమల్ నాథన్ కమిటీ సిఫారసుల ఆధారంగా ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.
గురువారం నాడు అసెంబ్లీలో టిఆర్ఎస్ ఎంఏల్ఏ శ్రీనివాస్ గౌడ్ ఆంద్రప్రదేశ్ పోలీసుల తరలింపుపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి స్పందించారు.
తెలంగాణ ఉద్యమంలో విధ్యార్థులు, నాయకులపై విచక్షణరహితంగా దాడులు చేసిన పోలీసులు ఇక్కడ విధులు నిర్వహించడం సముచితం కాదన్నారు.ఇప్పటివరకు ఎంతమంది పోలీసులను ఆంద్రకు పంపించారని హోంమంత్రిని ప్రశ్నించారు ఎంఏల్ఏ శ్రీనివాస్ గౌడ్.
తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు హైద్రాబాద్ ప్రస్తుతం ఉమ్మడి రాజధానిగా ఉందన్నారు.ఆంద్రప్రదేశ్ కు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులకు భద్రత కల్పించేందుకు మాత్రమే ఎపి పోలీసులు ఇక్కడే కొనసాగుతున్నారని చెప్పారు. తెలంగాణ పోలీసులు పరిమిత సంఖ్యలోనే హైద్రాబాద్ లో ఉండడం వల్ల ఎపి నేతలకు రక్షణ కల్పించడం తమ వల్ల కాదని ఆయన చెప్పారు.
కమల్ నాథన్ కమిటీ సిఫారసుల ఆధారంగానే ఆంద్రప్రాంతానికి చెందిన ఓ ఉద్యోగి కూడ తెలంగాణ ఉండటానికి వీల్లేదన్నారు మంత్రి. అందరినీ త్వరలోనే వారి స్వంత రాష్ట్రాలకు పంపిస్తామన్నారు నాయిని నర్సింహ్మరెడ్డి.మరో వైపు మరో 8 వేలకు పైగా ఎస్ ఐ, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు చెప్పారు మంత్రి.