సీఎం కేసీఆర్కు ఏటీసీ షాక్: ఏరియస్ సర్వేకు అనుమతి నిరాకరణ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) షాక్ ఇచ్చింది. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కరీంనగర్ జిల్లాలో సోమవారం పర్యటించాలని సీఎం కేసీఆర్ అనుకున్నారు. ఇందుకోసం కరీంనగర్కు సీఎం హెలికాప్టర్లో వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా పరిశీలించేందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) అనుమతి కోరారు. అయితే చివరి నిమిషంలో వాతావరణం అనుకూలించని కారణంగా ఏరియల్ సర్వేకు అనుమతి ఇవ్వలేమని ఏటీసీ అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
దీంతో సీఎం కేసీఆర్ రోడ్డుమార్గం ద్వారానే కరీంనగర్ జిల్లాలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. కరీంనగర్ జిల్లా పర్యనటలో భాగంగా సీఎం కేసీఆర్ మిడ్ మానేరు ప్రాజెక్టును సీఎం పరిశీలించనున్నారు. జిల్లాలోని ప్రాజెక్టులకు వస్తున్న వరద, వర్షాల పరిస్థితిపై అధికారులతో సీఎం సమీక్షించనున్నారు.
వాతావరణం అనుకూలిస్తే సీఎం మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేసే అవకాశం ఉంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఉపరితల ఆవర్తనంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఈనెల 28 నుంచి కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇక, సోమవారం ఏపీలోని విశాఖపట్నంలో భారీ వర్షం కురిసింది. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రేగుపాలెం-గుళ్లిపాడు మధ్య పట్టాలపై నుంచి వరదనీరు ప్రవహిస్తుండడంతో తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్లో పలు రైళ్లను నిలిపివేశారు.