విద్యార్థినిపై ఆటో డ్రైవర్ రేప్: భర్తను హత్య చేయించిన భార్య
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో ఇంటర్మీడియట్ విద్యార్థినిపై ఓ ఆటోడ్రైవర్ అత్యాచారం చేశాడు. యువతి కళాశాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలావుండగా, నల్లగొండ జిల్లాలోని సౌదిగౌరారం మండలం చెరువుమండలం గ్రామంలో దారుణమైన సంఘటన జరిగింది. మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో ఓ భార్య కట్టుకున్న భర్తను హత్య చేయించింది. సంకంటి మల్లేషం అనే వ్యక్తిని అతడి భార్య భారతమ్మ హత్య చేయించింది. కుటుంబ కలహాలతో రెండేళ్ల నుంచి భారతమ్మ వేరుగా ఉంటోంది.
అయితే తన తల్లిదండ్రులు, తమ్ముడు అనారోగ్యానికి గురి కావడానికి మల్లేషం కారణమని ఆమె అనుమానించింది. పథకం ప్రకారం తమ్ముడు శ్రీను, మరోవ్యక్తి సహకారంతో మల్లేషంను హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని లంకారం గ్రామ శివారులో పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
మగసంతానం కోసం రెండో పెళ్లి
నలుగురూ అడపిల్లలే పుట్టారని, మగ సంతానం కోసం రెండో పెళ్లికి సిద్ధమైన కానిస్టేబుల్పై అతని భార్య తన పిల్లలతో కలిసి శుక్రవారం మానవహక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసింది. మెదక్ జిల్లా గద్వేల్ మండలం బేగంపేటకు చెందిన బాలలక్ష్మి, నర్సింహులు భార్యాభర్తలు. కానిస్టేబుల్ అయిన నర్సింహులు తనకు నలుగురు ఆడపిల్లలే పుట్టారని భార్యను వేధిస్తున్నాడు.
పైగా, రెండో పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. భర్త మరో పెళ్లి చేసుకుంటే తాను, పిల్లలు రోడ్డున పడతామని ఫిర్యాదులో పేర్కొంది. భర్త నుంచి ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని బాలలక్ష్మి కోరింది. ఆమె ఫిర్యాదుని పరిశీలించిన మానవహక్కుల సంఘం దీనిపై పూర్తి దర్యాప్తు జరిపి ఆగస్టు 26వ తేదీ లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని మెదక్ ఎస్పీని ఆదేశించింది.