ఇలాగేనా..: భద్రాద్రిలో వధూవరులకు చేదు అనుభవం
భద్రాచలం: భద్రాద్రి దేవస్థానం అధికారులు తమ చిత్ర విచిత్ర నిర్ణయాలతో భక్తులను బెంబేలెత్తిస్తున్నారు. బాధపెడుతున్నారు. తాజాగా... భద్రాద్రి రామయ్య సన్నిధిలో వివాహం చేసుకునేందుకు వచ్చిన మరో జంటకు చేదు అనుభవం ఎదురయింది.
ఇటీవల హైదరాబాద్కు చెందిన వధూవరులను భద్రాద్రి రామాలయ ప్రాంగణంలో వివాహం చేసుకునేందుకు అనుమతించని దేవస్థానం అధికారులు, తాజాగా మరో జంటకు పెళ్లి చేసుకునేందుకు అనుమతివ్వలేదు. దీంతో వారు మనో వేదనకు గురయ్యారు. ఏపీలోని కర్నూలుకు చెందిన నరేష్ బాబు-శివ పార్వతి భద్రాద్రిలో పెళ్లి చేసుకుందామని బుధవారం వచ్చారు.
వారితో పాటు సుమారు 50 మంది బంధువులు భద్రాద్రి చేరుకొన్నారు. రామాలయ ప్రాంగణంలో వివాహం చేసుకునేందుకు దేవస్థానం అధికారులను సంప్రదించగా.. ''ఇక్కడ కుదరదు, తానీషా కల్యాణ మండపానికి వెళ్లాలి'' అని సూచించినట్లు తెలిసింది. వారు అక్కడికి వెళ్లగా.. ''రూ.2,500 చెల్లిస్తేనే పెళ్లి చేసుకోవచ్చు'' అని సమాధానం వచ్చింది.
అంత మొత్తం చెల్లించలేక తహసీల్దారు కార్యాలయం సమీపంలోని కోదండ రామాలయంలో వివాహం చేసుకున్నారు. అధికారుల నిర్ణయాన్ని భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.