డబ్బిస్తే తిడతావా: కేసీఆర్పై దత్తాత్రేయ, ఏపీ-టీ నుంచి రాజ్యసభ రేసులో వీరే..
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం పైన కేంద్రమంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ మంగళవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఖర్చు చేస్తూ పరిపాలన సాగిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్, తెరాస నేతలు తమ పార్టీ పైన, తమ పార్టీ నేతలపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.
మంగళవారం ఉదయం హైదరాబాదులో తెలంగాణ బీజేపీ వర్క్ షాప్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడారు. బీజేపీ నేతలపై కేసీఆర్ వ్యాఖ్యలు ఆక్షేపణీయమన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసినా, కేసులు పెడతామని బెదిరించినా సహించేది లేదన్నారు.
రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన నిధుల గురించి ప్రజలకు తెలియజెప్పాలని, ఎన్డీయే పాలనపై గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని దత్తాత్రేయ కార్యకర్తలకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి పనులను పల్లె పల్లెకూ తీసుకెళ్లాలన్నారు.
రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్
రాజ్యసభ ఎన్నికలకు మంగళవారం నాడు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలుకానుంది. మే 31 వరకు నామినేషన్లు తీసుకుంటారు. జూన్ 1న నామినేషన్ల పరిశీలిస్తారు. 3న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు.
జూన్ 11న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. అదే రోజు సాయంత్రం అయిదు గంటలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు, ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. తెలంగాణలో రెండు స్థానాలు తెరాస గెలుచుకోనుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎవరికి అవకాశం ఇస్తారనే చర్చ సాగుతోంది.
రాజ్యసభ ఆశిస్తున్న వారిలో మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంత రావు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే మరో మాజీ మంత్రిఫరీదుద్దీన్ పేరు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న వేణుగోపాల చారి, రామచంద్రుడు నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డీ శ్రీనివాస్ పేరు, పార్టీ కోశాధికారి డి దామోదర రావు పేర్లు వినిపిస్తున్నాయి.
ఇక, ఏపీ నుంచి టిడిపికి మూడు, వైసిపికి ఒకటి దక్కే అవకాశముంది. టిడిపి నుంచి సుజనా చౌదరి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మిత్రపక్షం బీజేపీకి ఒక సీటు ఇవ్వొచ్చు. నిర్మలా సీతారామన్ పేరు వినిపిస్తోంది. వైసిపి నుంచి విజయ సాయి రెడ్డి పేరు వినిపిస్తోంది.