తీరని కరెన్సీ కష్టాలు, ఇప్పటివరకు తెలంగాణ బ్యాంకుల్లో 45 వేల కోట్ల డిపాజిట్లు
హైదరాబాద్ : పెద్ద నగదునోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జమఅవుతున్న కరెన్సీకి తగ్గట్టుగా కొత్త కరెన్సీ ప్రజలకుఅందుబాటులోకి రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన 26 రోజులు కావస్తోన్నా ఆశించిన మేరకు నగదు ప్రజలకు అందుబాటులో లేదు. ఈ ప్రభావంతో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
బ్యాంకుల్లో డిపాజిట్లు ఎక్కువ.. ప్రజలకు చేరేది తక్కువ
పెద్ద నగదు నోట్లు రద్దు చేసే సమయానికి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 90 వేల కోట్ల నగదు చలామణిలో ఉంది. ఇప్పటివరకు సుమారు 45 వేల కోట్ల రూపాయాలు బ్యాంకులు డిపాజిట్లు అయ్యాయి. అంటే రాష్ట్రంలో చలామణిలో ఉన్న డబ్బులో సగానికి పైగా బ్యాంకుల్లో జమఅయింది. అయితే ఆ మేరకు కొత్త కరెన్సీ బ్యాంకులకు చేరలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.బ్యాంకుల్లో డిపాజిట్లు చేసిన పాత కరెన్సీకి సమానంగా కొత్త కరెన్సీని అందుబాటులోకి తెస్తే ప్రజలు ఇంత ఇబ్బంది పడేవారు కాదు.నెల మొదటి వారంతో వేతనాల కోసం, పెన్షన్ల కోసం ప్రజలు బ్యాంకులు, ఎటిఎం ల వద్ద క్యూ లు కడుతున్నారు.
వచ్చింది 12,500 కోట్లు
రద్దుచేసిన నగదు రాష్ట్రంలో సుమారు 90 వేల కోట్లు చలామణిలో ఉంటే ఇప్పటివరకు సుమారు 45 వేల కోట్లను బ్యాంకుల్లో జమచేశారు. అయితే ఇప్పటివరకు ఆర్ బి ఐ రాష్ట్రానికి ఎంత పంపిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కేవలం 12,500 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి. అంటే నగదు కొరత తీవ్రంగా ఉన్న కారణంగా ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు.ఈ నగదులో అత్యధికంగా రెండువేల రూపాయాల కొత్త నోటే ఉండడంతో కష్టాలు తీరేందుకు మరింత సమయం పట్టింది. కొత్త ఐదువందల రూపాయాల నోటు వచ్చినా ముద్రణ లోఫాల కారణంగా వాటిని ఆర్ బి ఐ తిరిగి వెనక్కి తీసుకొంది.
వేతన జీవులకు తప్పని తిప్పలు
ప్రతి నెల మొదటివారంలో వాయిదాల చెల్లింపులు, ఇంటి అద్దె తదితర బిల్లుల చెల్లింపు కోసం డబ్బు అవసరం, ప్రభుత్వ ఉద్యోగులకు పదివేల రూపాయాలను బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా చెల్లించారు. అయితే ప్రైవేట్ ఉద్యోగులు, ఇతరత్రా చెల్లింపుల కోసం బ్యాంకులు, ఎటిఎం ల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొంది. దరిమిలా బ్యాంకుల్లో , ఎటిఎంల వద్ద కొన్ని గంటల్లోనే నగదు అయిపోతున్న పరిస్థితి కన్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల బ్యాంకు బ్రాంచ్ ల ద్వారా నగదును సరఫరాచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నగదు సరఫరాను మెరుగుపర్చేందుకు తగిన చర్యలను తీసుకొంటుంది ప్రభుత్వం. సరిపోను నగదు సరఫరా కాకపోవడంతో నగదు లేదనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని రోజులు ఈ కష్టాలు తప్పకపోవచ్చు.