లేడీ టీచర్ రాక్షసత్వం: దెబ్బలకు రక్తం కక్కుతూ కూలిన విద్యార్థి
హైదరాబాద్: హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా టీచర్ దెబ్బలకు పదో తరగతి విద్యార్థి ఆస్పత్రి పాలయ్యాడు. జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డినగర్లో ఉన్న రాజధాని స్కూల్లో బీహార్కు చెందిన రాంజనంప్రసాద్ కుమారుడు సురేశ్(15) పదో తరగతి చదువుతున్నాడు.
సురేశ్ జ్వరంతో రెండురోజులు ఇంట్లోనే ఉన్నాడు. బుధవారం స్కూల్కు వెళ్లగా రోజుకు రూ.100 చొప్పున ఫైన్కట్టాలని టీచర్ రమాదేవి బెదిరించారు. తాను కట్టలేనని సురేశ్ చెప్పటంతో కోపంతో విద్యార్థి తలపై గట్టిగా కొట్టింది. సురేశ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి రక్తం కక్కుతూ వాంతులు చేసుకున్నాడు.
దీంతో స్కూల్ యాజమాన్యం సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. సురేశ్ మెదడులో రక్తనాలాలు చితికినట్లు వైద్యులు వెల్లడించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆపరేషన్ చేయాలని సూచించారు. విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగాయి.
అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని, స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి వైద్యఖర్చులను యాజమాన్యమే భరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.