బీఫ్ ఫెస్టివెల్, 'స్వార్థపరుల చేతిలో ఆయుధం కావొద్దు': బస్సులపై రాళ్ల దాడి
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఫ్ ఫెస్టివెల్ గురువారం నాడు ఉద్రిక్తతలకు దారి తీసింది. బీఫ్ ఫెస్టివెల్ నిర్వహించేందుకు కొందరు విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని ముందస్తుగా అరెస్టు చేశారు. విద్యానగర్, నల్లకుంట ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు బస్సుల పైన రాళ్లతో దాడి చేశారు.
అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్సు, లంగర్ హౌస్ వద్ద కూడా బస్సుల పైన రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో బస్సుల అద్దాలు పగిలిపోయాయి. ఓయూలో పోలీసులు భారీగా మోహరించారు. బీఫ్ ఫెస్టివల్ జరగకుండా హాస్టళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్సీసీ గేట్ వద్ద త్రివేణి హాస్టల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ముందస్తుగా పలువురు విద్యార్థులను అరెస్టు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రెండు గేట్లను పోలీసులు మూసివేశారు. బీఫ్ ఫెస్టివెల్ నిర్వహిస్తే అడ్డుకునేందుకు ఓయూకు వచ్చిన శివసేన, బజరంగ్ దళ్, గోసంరక్షణ సమితి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే, ముందుగానే పోలీసులు బీఫ్ ఫెస్టివెల్ నిర్వహించకుండా చర్యలు తీసుకున్నారు. బీఫ్ ఫెస్టివెల్ నిర్వహించకుండా చూడాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. బీఫ్ ఫెస్టివెల్కు నో చెప్పిన హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
పెద్ద కూర పండుగ పైన ఇప్పటికే సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, దాని పైన మళ్లీ ఉత్తర్వులు ఎందుకని ప్రశ్నించింది. ఓయూలో బీఫ్ ఫెస్టివెల్ నిర్వహించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
సిటీ సివిల్ కోర్టు వ్యాజ్యంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. బీఫ్ వంటి వాటిని ఇంటి దగ్గర తింటే అడిగేవారు ఉండరు కదా అని విద్యార్థులకు హితవు పలికింది. స్వార్థపరుల చేతిలో ఆయుధాలుగా మారకూడదని బీఫ్ ఫెస్టివెల్ విద్యార్థులు, నిర్వాహకులకు హితవు పలికింది.