దొంగలు బీరువా తెచ్చి రైలు పట్టాలపై వేశారు, నిలిచిన ఎక్స్ప్రెస్ రైలు
వరంగల్/హైదరాబాద్: దొంగలు తాము చోరి చేసిన బీరువాను రైలు పట్టాల మీద వదిలి వెళ్లడంతో రైలు నిలిచిపోయిన సంఘటన జరిగింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామంలో జరిగింది.
గోవర్ధనగిరికి చెందిన బి పరశురాములు శుక్రవారం కుటుంబ సభ్యులతో ధర్మసాగర్లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇదే అదనుగా శనివారం రాత్రి ఆయన ఇంట్లో దొంగలు పడ్డారు. నగదు, వెండిని దొంగిలించడమే కాకుండా ఇంట్లోని బీరువాను తమతో పాటు తీసుకెళ్లారు.
దానిని సమీపంలో ఉన్న రైల్వే పట్టాల పైన పడవేశారు. తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో కాజీపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న దక్షిణ్ ఎక్స్ప్రెస్ ఆ బీరువాను ఢీకొట్టింది. శబ్దం రావడంతో డ్రైవర్ వెంటనే నిలిపేశాడు. బోగీల మధ్య ఇరుక్కుపోయిన బీరువా రేకులను తొలగించారు. ఆ తర్వాత రైలు ముందుకు వెళ్లింది.
శంషాబాద్ విమానాశ్రయంలో డ్రగ్స్ పట్టివేత
సినీ ఫక్కీలో మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న దక్షిణాఫ్రికా యువతి మూసా(32)ను శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. కడుపు, మర్మావయంలో ఆమె మాదకద్రవ్యాలను తీసుకొచ్చింది. దక్షిణాఫిక్రా నుంచి కొందరు యువతులు హైదరాబాద్కు మాదకద్రవ్యాలు తీసుకొస్తున్నారన్న సమాచారంతో మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు రెండురోజులుగా విమానాశ్రయంలో నిఘా ఉంచారు.
జోహెన్నెస్బర్గ్ నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్కు ఆదివారం మధ్యాహ్నం వచ్చిన ఎమిరేట్స్ విమానంలోంచి దిగిన ప్రయాణికులను మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు గమనించారు. మూసా ప్రవర్తన అసహజంగా కనిపించడంతో ఆమెను ప్రశ్నించారు.
తనకు పొత్తికడుపులో నొప్పిగా ఉందని, వదిలేయాలంటూ అధికారులను కోరింది. వైద్య పరీక్షలు నిర్వహించాక వదిలేస్తామంటూ మహిళా అధికారులు విమానాశ్రయంలోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులతో పరీక్షలు చేయిస్తుండగా తాను మాదకద్రవ్యాలను తీసుకువచ్చానని అంగీకరించింది.
వెంటనే ఆమెను ఉస్మానియాకు తరలించారు. 16 మాదకద్రవ్యాల సంచులుమూసాముసాయిన్ను ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు మూడు గంటల పాటు పరీక్షించారు. తొలుత అల్ట్రాసౌండ్ ద్వారా పరిశీలించగా కడుపులోని మాదకద్రవ్యాల సంచులు, మూత్రనాళం వద్ద ఒక సంచి కనిపించింది.
అప్పటికే ఆమెకు పొత్తికడుపు నొప్పి తీవ్రమవడంతో మర్మావయంలోంచి ఒక సంచిని తీశారు. స్కాన్ చేయగా సెల్ఫోన్ పరిమాణం అంత సంచి, మరికొన్ని వస్తువులు కనిపించాయి. శస్త్రచికిత్స నిర్వహించాలని అనుకున్నా కడుపులో మాదక ద్రవ్యాలు పగిలిపోతే ప్రమాదమన్న భావనతో ఆపేశారు.
ఎండోస్కోపి ద్వారా మరోసారి పరీక్షించగా సంచి చుట్టూ ప్లాస్టిక్పూత ఉన్నట్టు గుర్తించారు. ఎక్కువగా నీళ్లు తాగించి, ఎనిమా ఇచ్చి శరీరంలోంచి ఆ సంచిని తీశారు. 15 సంచులున్నాయి. ఒక్కో సంచిలో 15-25గ్రాముల డ్రగ్స్ ఉండొచ్చని అంచనా వేశారు.
ఇలాంటివి మరో నాలుగున్నాయని, కొద్దిగంటలు వ్యవధి ఇచ్చిన అనంతరం తీయాలని నిర్ణయించారు. 16 సంచుల్లో ఉన్న మాదకదవ్రాన్ని పరీక్షల నిమిత్తం పంపారు. హెరాయిన్ లేదా కొకైన్గా అనుమానిస్తున్నారు. వీటివిలువ రూ.50లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు.