నిన్న కావేరీ, నేడు ఏపీ, తెలంగాణలకు కృష్ణా నీళ్లు: బీజేపీది రాజకీయ మౌనమా?
విజయవాడ: కృష్ణా నీటి విషయంలో బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పు పైన తాము సుప్రీం కోర్టులో వాదనలు వినిపిస్తామని, నాలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరగాలని కోరుతామని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం నాడు అన్నారు.
గత ప్రభుత్వాలు కృష్ణా నీటి విషయంలో సరైన వాదనలు వినిపించలేకపోయాయని చెప్పారు. అందుకే ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. తీర్పు పైన సుప్రీం కోర్టులో ఏపీ తరఫున వాదనలు వినిపిస్తామని చెప్పారు.
కేంద్రం గొడవలు పెడుతోంది: నారాయణ
నీటి పంపిణీ సమస్యలను సామరస్యంగా పరిష్కరించకుండా బిజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య గొడవలు పెడుతోందని, తద్వారా రాజకీయ పబ్బం గడుపుకుంటోందని సిపిఐ నేత నారాయణ విమర్శించారు.
కావేరీ నదీ జలాల విషయంలో కోర్టు తీర్పును కర్నాటక అమలు చేయకపోతే కేంద్రం చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. అంతే తప్ప సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవడం లేదని విమర్శించారు.
ఇప్పుడు కృష్ణా జలాల విషయంలోను అదే తరహా వ్యవహరిస్తోందన్నారు. రాజకీయంగా లబ్ధి చేకూరే మహారాష్ట్ర, కర్నాటకలకు అనుకూలంగా వ్యవహరిస్తూ తనకు ప్రాధాన్యం లేని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను వదిలేసిందని విమర్శించారు.