కలకలం: డిగ్గీకి కోమటిరెడ్డి ఫిర్యాదు, దెబ్బకొట్టేందుకే.. ఆగ్రహం వెనుక!
కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నారు. గడ్డాలు, మీసాలు పెంచితే మన పార్టీ అధికారంలోకి రాదని రెండు రోజుల క్రితం అన్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నారు. గడ్డాలు, మీసాలు పెంచితే మన పార్టీ అధికారంలోకి రాదని రెండు రోజుల క్రితం అన్నారు.
అనంతరం ఉత్తమ్ నాయకత్వమే కొనసాగితే రాష్ట్రంలో పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ కు తేల్చి చెప్పారు. సోమవారం ఉదయం పార్క్ హయత్లో డిగ్గీతో దాదాపు గంటపాటు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి ఇటీవలి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను చేసిన విమర్శలన్నీ నిజమేనని చెప్పారు.గత ఎన్నికల్లో ఉత్తమ్, పొన్నాల జోడీ విఫలమైందని అన్నారు.
పీసీసీని, ఇంప్లిమెంటేషన్ కమిటీని తిరిగి వారికే అప్పగించడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. నకిరేకల్ నియోజకవర్గంలో పార్టీ ఓడిపోతుందని కావాలనే లీక్ చేశారని ఆరోపించారు. ఇంత జరిగినా తాను పార్టీకి సహకరిస్తూనే ఉన్నానని చెప్పారు.
పార్టీని వీడే ఉద్దేశం లేదని తెలిపారు. గత మూడేళ్లలో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదని, కావాలంటే సర్వే చేసి చూసుకోవాలని దిగ్విజయ్ సింగ్కు చెప్పారు. ఈ విషయంపై అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత అధిష్ఠానం దృష్టిని సారిస్తుందని, అంతవరకూ విభేదాలు, విమర్శలు వద్దని దిగ్విజయ్ హితవు పలికారని తెలుస్తోంది.
కొద్ది రోజులుగా విమర్శలు
కాగా, కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఉత్తమ్ పైన గత కొద్ది రోజులుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఉత్తమ్ టీపీసీసీ చీఫ్గా నియమితులైనప్పటి నుంచి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. అయితే, ఇటీవల విమర్శల దాడి పెంచారు.
కారణం ఇదీ..
అందుకు ఓ కారణం ఉందని చెబుతున్నారు. ఇటీవల గాంధీ భవన్లో జరిగిన టిపిసిసి కార్యవర్గ సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలు తనను రాజకీయంగా దెబ్బతీసేందుకేనని కోమటిరెడ్డి భావిస్తున్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై టిపిసిసి రహస్యంగా సర్వే నిర్వహించి, నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాల పరిస్థితిపై వచ్చిన ఫలితాలు అంటూ ఆ సమావేశంలో ఉత్తమ్ వెల్లడించారు.
సర్వే ఫలితాలపై..
ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి మంచి సీట్లు వస్తాయని, కొంచెం కష్టపడితే మరో ఇరవై సీట్లు వస్తాయని తమ సర్వేలో తేలిందని చెప్పారు. మిగతా స్థానాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉందని చెప్పారు. వాటిల్లో కష్టపడాల్సి ఉందన్నారు.
గెలుపై..
పాత నల్గొండ జిల్లాలోని నకిరేకల్, భువనగిరి నియోజకవర్గాలు మినహా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలో వచ్చినట్లు ఉత్తమ్ సన్నిహితుల ద్వారా మీడియాకు లీకు ఇచ్చినట్లు కోమటిరెడ్డి భావిస్తున్నారు. నకిరేకల్లో కాంగ్రెస్ ఓడుతుందని చెప్పడం ద్వారా తనను దెబ్బతీసే ఎత్తులు వేస్తున్నారని కోమటిరెడ్డి భావించినందువల్లే విమర్శల దాడి పెంచారని అంటున్నారు.