కాంగ్రెసుకు షాక్: బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి
భద్రచాలం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, తన భర్త ధర్మాతో కలిసి బీజేపీలో చేరారు.
భద్రాచలం: భద్రచాలం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణలో బీజేపీ పునాదులను పటిష్టపరిచేందుకు ఆ పార్టీ నాయకత్వం తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే భద్రాచలంలో కొంత రాజకీయ కదలిక వచ్చింది.
ఇతర పార్టీల్లోని ముఖ్యులను, రాజకీయ నిరుద్యోగులను, స్థానిక ప్రముఖులను తనవైపు ఆకర్షించేందుకు నాయకత్వం ప్రయత్నిస్తోంది. స్థానిక ప్రముఖుడు, ఐటీసీ బీపీఎల్ కాంట్రాక్టర్, కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు, 'గాంధీపథం' పేరుతో స్వంత దుకాణం (సంస్థ) తెరిచిన బూసిరెడ్డి శంకర్ రెడ్డి కొన్నాళ్ల కిందటే బీజేపీలో చేరి, 'రాష్ట్ర' నాయకుడైపోయారు.
తాజాగా, ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, తన భర్త ధర్మాతో కలిసి బీజేపీలో చేరారు. వరంగల్ లో బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ర్ట అధ్యక్షుడు లక్ష్మణ్ ను కలిశారు. సభ్యత్వం తీసుకున్నారు.
కుంజా సత్యవతి, ధర్మా దంపతులు పూర్వాశ్రమంలో ఈ ప్రాంత సీపీఎం ముఖ్య నాయకులు. ఆ తరువాత, వైఎస్ఆర్ చలవ, చొరవతో కాంగ్రెస్ లో చేరారు. 2009 ఎన్నికల్లో భద్రాచలం నుంచి సత్యవతి కాంగ్రెస్ టికెటుపై గెలిచారు. వైఎస్ మరణానంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.
ఆ తరువాత వైఎస్ఆర్ సీపీలోకి వచ్చారు. కొన్నాళ్ల తరువాత మళ్లీ కాంగ్రెసులోకి వెళ్లారు. కొంతకాలం నుంచి ఆ పార్టీతోనూ, ఇతర ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా ఉన్నారు. తాజాగా, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.