తెలంగాణలో దొంగలు పడ్డారు: భట్టి విక్రమార్క
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో దొంగలు పడ్డారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు అధికారం ఇస్తే.. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిందని విమర్శించారు. రాష్ట్రంలోని వనరులను ఒక కుటుంబం దోపిడీ చేస్తోందని ఆరోపించారు.
ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ తీసుకొస్తామన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని విక్రమార్క దుయ్యబట్టారు. ప్రజలు, ఉద్యోగులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.
డెంగ్యూ, ఇతర వైరల్ వ్యాధులతో ప్రజలు బాధపడుతుంటే, ఓ మంత్రి మాట్లాడుతూ.. డెంగ్యూ వ్యాధి రాష్ట్రంలో లేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. వ్యాధి బారిన పడి టిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం ప్రభుత్వానికి తెలియదా? అని ఆయన ప్రశ్నించారు.
27న ధర్నా: డికె అరుణ
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా అక్టోబర్ 27న మహబూబ్నగర్ జిల్లాలో భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ చెప్పారు. ఒక్క నెలలోనే మహబూబ్ నగర్ జిల్లాలో 20మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆమె తెలిపారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేస్తున్న ఈ ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొనాలని డికె అరుణ పిలుపునిచ్చారు.
చిదంబరంపై కాంగ్రెస్ నేతల మండిపాటు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబంరంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాంధీ కుటుంబంపై విమర్శలు చేసే అర్హత చిదంబరంకు లేదని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పదేళ్లపాటు కేంద్రమంత్రిగా ఉన్న చిదంబరం ఎన్నికల్లో పోటీ చేసేందుకు భయపడ్డారని అన్నారు.
చిదంబరం వ్యాఖ్యలను మరో కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖండించారు. ఎన్నో ఆరోపణలున్నప్పటికీ ఉన్నత పదవులను కట్టబెట్టిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపైనే విమర్శలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీల నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి అన్నారు. ప్రజాసేవ చేసే వారికి పదవులు పొందే అవకాశం కాంగ్రెస్ పార్టీలోనే ఉందని చెప్పారు.
కాగా, ఓ ప్రముఖ ఛానల్తో చిదంబరం మాట్లాడుతూ.. సోనియా గాంధీ ఉన్నంత వరకూ కాంగ్రెస్ పార్టీలో ఆమే నెంబర్ వన్ అన్నారు. పార్టీలో ఇప్పటికైనా వ్యక్తిగత భజనలు ఆపాలని అన్నారు. ఓటమిల నేపథ్యంలో పార్టీ పునర్ వ్వవస్ధీకరణ తక్షణమే చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అత్యవసరంగా దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్లో పార్టీ అధ్యక్ష పదవిని ఎవరైనా చేపట్టొచ్చని ఆయన పేర్కొన్నారు.