ఈ కలెక్టర్ అందరికీ ఆదర్శం: ప్రభుత్వాసుపత్రిలో కూతురికి ప్రసవం చేయించారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఎం మురళి.. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచారు. ములుగులోని ప్రభుత్వాసుపత్రిలో జిల్లా కలెక్టర్ మురళి శుక్రవారం తన కుమార్తెకు ప్రసవం చేయించారు.
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళి.. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచారు. ములుగులోని ప్రభుత్వాసుపత్రిలో జిల్లా కలెక్టర్ మురళి శుక్రవారం తన కుమార్తెకు ప్రసవం చేయించారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకే తాను ఇలా చేశానని కలెక్టర్ పేర్కొన్నారు.
కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచీ ఆయన.. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రసవాలు జరిగేలా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కుమార్తెను శుక్రవారం ములుగు సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి డాక్టర్ల పర్యవేక్షణలో ప్రసవం చేయించారు.
హైదరాబాద్లో ఉంటున్న కలెక్టర్ కుమార్తె, అల్లుడు ప్రగతి, ప్రదీప్ భూపాలపల్లికి వచ్చారు. స్త్రీల వైద్య నిపుణులు లావణ్య, సుగుణ, చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రానికి చెందిన డాక్టర్లు స్నిగ్ధ, లలితాదేవి పర్యవేక్షణలో జరిగిన ప్రసవంలో ప్రగతికి పాప పుట్టింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలపై ప్రజల్లో నమ్మకం, ధైర్యం కలిగించే ప్రయత్నంలో భాగంగానే తన కూతురిని ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చి.. ప్రసవం చేయించినట్లు కలెక్టర్ మురళి చెప్పారు. ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలూ ఉన్నాయని ఆయన తెలిపారు. కాగా, ఈ కలెక్టర్పై ప్రస్తుతం అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.