రెచ్చిపోయిన ఆకతాయిలు: ఇంటి బయట కారు పార్కింగ్ చేస్తే అద్దాలు పగలగొట్టారు
హైదరాబాద్: మీరు కారుని ఇంటి బయట పెట్టి నిద్రిస్తున్నారు. తెల్లావారే సరికే మీ కారు అద్దాలు పగిలిపోయయా? సరిగ్గా ఇలాంటి సంఘటనే శుక్రవారం రాత్రి సరూర్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. నగరంలో ఆకతాయిలు రాత్రుళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు.
ఇళ్ల బయట పార్కింగ్ చేసిన కార్లపై రాత్రి వేళల్లో కర్రలు, రాళ్లు చేతబట్టి అద్దాలను పగులగొడుతున్నారు. నిన్న రాత్రి సరూర్ నగర్ ప్రాంతంలో 20 కార్ల అద్దాలను గుర్తుతెలియని ఆకతాయిలు పగులకొట్టారు. ఈ సంఘటన సరూర్ నగర్ పరిధిలోని కోదండరాంనగర్, పీ అండ్ టీ కాలనీ, శారదా నగర్ల పరిధిలో చోటు చేసుకుంది.
దీంతో స్ధానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ కాలనీల్లో పోలీసులు రాత్రిపూట పెట్రోలింగ్ చేయక పోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. కాలనీల్లో గస్తీ పెంచాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆకతాయిలను గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
మరోవైపు ద్విచక్ర వాహనాలు దొంగిలించి వాటిపై దర్జాగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5.15 లక్షల విలువగల 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజగిరి డీసీపీ రమారాజేశ్వరి వివరాలను వెల్లడించారు.
ఉప్పల్ ఎస్ఐ రవికుమార్ వాహనాలను తనిఖీ చేస్తుండగా బస్టాండ్ వద్ద అనుమానాస్పద స్ధితిలో ద్విచక్ర వాహనంపై బోడుప్పల్ వైపు వెళుతున్న రామాంతపూర్కు చెందిన వల్లపు అశోక్ను ఆపి ప్రశ్నించగా అతడు నడుపుతున్న వాహనం దొంగిలించిందని తేలింది.
దీంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రామాంతపూర్ శారదానగర్కు చెందిన మంతిపురం రాములు, వల్లపు శ్రీకాంత్లు వేరు వేరు వాహనాలుపై వెళుతుండగా ఉప్పల్ రింగ్ రోడ్డుపై ఆపి పత్రాలు చూపించమని అడగటంతో అవి దొంగిలించిన వాహనాలని అంగీకరించారు.
వారిద్దరి వద్ద నుంచి 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు.