నిన్న అమిత్ షా.. నేడు లిఫ్ట్లో చిక్కుకుపోయిన బండారు దత్తాత్రేయ (ఫోటో)
హైదరాబాద్: ఇటీవల బీహార్ పర్యటనకు వెళ్లిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షా లిఫ్టులో చిక్కుకుపోయారు. ఆదివారం నాడు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాదులో లిఫ్టులో ఇరుక్కుపోయారు.
కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం ఉదయం హైదరాబాదులో లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు దత్తాత్రేయ నగరంలోని కాచిగూడకు వెళ్లారు. వేదిక వద్దకు చేరుకునేందుకు భవనంలోని లిఫ్ట్ ఎక్కారు.
దత్తాత్రేయ లిఫ్ట్ ఎక్కిన తర్వాత కొద్ది దూరం కదిలిన లిఫ్ట్ రెండు అంతస్తుల మధ్య నిలిచిపోయింది. దీంతో భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. అయితే భద్రతా సిబ్బంది చేపట్టిన చర్యలు కాస్తంత త్వరగానే ఫలించి లిఫ్ట్ తలుపులు తెరచుకున్నాయి. దత్తన్న బయటపడ్డారు.
దీంతో, అందరు ఊపిరి పీల్చుకున్నారు.ఇటీవల, బీహార్ పర్యటనకు వెళ్లిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాట్నాలోని ఓ లిఫ్టులో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. పోలీసులు, ఇతరులు డోర్లను బద్దలు కొడితే ఆయన బయటపడ్డారు.